బిచ్చ‌గాడి అంతిమ యాత్ర.. ఎమ్మెల్యేల నుంచి పెద్దోళ్ల వ‌ర‌కు!

ఏవైనా బంధువులో మిత్రులో ప్ర‌జ‌ల‌కు సేవ చేసిన‌వారో.. తుదిశ్వాస విడిస్తే.. నిర్వ‌హించే అంతిమ యాత్ర‌కు బంధువ‌ర్గం.. అభిమానులు.. పోటెత్త‌డం ఖాయం. అయితే.. ఒక బిచ్చ‌గాడు చ‌నిపోతే.. అది కూడా రోడ్డుప‌క్క‌న ప్రాణం విడిస్తే.. ఎవ‌రైనా ప‌ట్టించుకుంటారా? క‌నీసం క‌న్నెత్తి కూడా చూడ‌రు. ఏమునిసిపాలిటీ వాళ్లో వ‌చ్చి.. తీసుకుపోయి.. శ్మ‌శానంలో అప్ప‌గిస్తారు. చేతులు దులుపుకొంటారు! అంత‌కుమించి జ‌రిగేది ఏమీ ఉండ‌దు. కానీ.. అంద‌రి బిచ్చ‌గాళ్ల‌లో ఈ బిచ్చ‌గాడు వేర‌యా! అన్న‌ట్టుగా ఉంది క‌ర్ణాట‌క‌లోని ఒక బిచ్చ‌గాడి ప‌రిస్థితి.

కర్ణాటకలోని బళ్లారిలో జరిగిన ఓ యాచకుడి అంతిమ యాత్ర కు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే, ప్ర‌జాప్ర‌తినిదులు కూడా వ‌చ్చారు. నిజానికి ఎవరైనా ప్రముఖులు చనిపోతే వచ్చేంత మంది ఈ బిచ్చ‌గాడు మరణిస్తే చూసేందుకు వచ్చారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కర్ణాటక బళ్లారిలోని హడగళికి చెందిన బసవ అలియాస్ హుచ్చా బాస్యా అనే యాచకుడు ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇతని అంతమ యాత్రకు వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. దీనికి కారణం ఆయనతో ఆ పట్టణ వాసులకు ఉండే ప్రత్యేక అనుబంధమే.

బసవకు భిక్షం పెడితే మంచి జరుగుతుందని అక్కడి వారి నమ్మకం. అందుకే చాలా మంది పిలిచి మరీ అతనికి అన్నదానం చేసేవారు. ఇటీవ‌ల‌ జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో బాస్యా మృతి చెందాడు. దీంతో అతడి అంత్యక్రియలు నిర్వహించారు. పట్టణంలో బ్యానర్లు కట్టి.. ఊరేగింపుగా పార్థివదేహాన్ని తీసుకెళ్లారు. బాస్యా మరణ వార్త విన్న చాలా మంది ప్రజలు అతడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పలకరించిన వారందినీ బాస్యా.. అప్పాజీ(నాన్నగారు) అని పిలిచే వాడని తెలిపారు. భిక్షం ఎత్తుకుని జీవనం సాగించే అతడు.. డబ్బులు ఎంత ఇచ్చినా 1 రూపాయి మాత్రమే తీసుకుని మిగతా సొమ్మును వెనక్కి ఇచ్చేవాడు.

మాజీ ఉప ముఖ్యమంత్రి దివంగత ఎం.పి. ప్రకాశ్, మాజీ మంత్రి పరమేశ్వర నాయక్ లాంటి రాజకీయ నాయకులందరితో ఎటువంటి బెరుకు లేకుండా మాట్లాడే వాడని స్థానికులు చెప్తున్నారు. బాస్యాతో మాట్లాడడాన్ని కూడా చాలా మంది అదృష్టంగా భావించేవారని, అందుకే అతడ్ని ఇలా గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తానికి బిచ్చ‌గాడికి ల‌భించిన అంతిమ గౌర‌వం… ప్ర‌స్తుతం నెటిజ‌న్ల‌ను ఫిదా చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. అంద‌రూ ‘రిప్’ అంటూ సందేశాలు పెడుతున్నారు.