ఆత్మ ఉందా లేదా?

ఈ సిరీసులో మునుపటి రెండు వ్యాసాల్లోనూ జీవితానుభవాల్లో కనిపించిన రెండు భగవద్గీతా శ్లోకాల్ని పంచుకున్నాను. ఇక్కడ ఆలోచించి చర్చించుకోదగిన ఒక అంశాన్ని మీ ముందు ఉంచుతున్నాను. వేల ఏళ్లనాటి భగవద్గీతలోని రెండు శ్లోకాలు ఇప్పటి సైన్సు సూత్రాలనే చెబుతున్నాయనే చర్చను మాత్రమే నా పరిధిలో ఆలోచించి నాకు అనిపించింది రాస్తున్నాను.

నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః

ఇది భగవద్గీత 2 వ అధ్యాయంలో 23వ శ్లోకం.
అర్థం:ఆత్మని ఆయుధాలు ఛేదించలేవు, నిప్పు కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండింపజేయలేదు.

అదే వరుసలో 27 వ శ్లోకం కూడా ఒకసారి చూసేద్దాం.

జాతస్యహి ధృవో మృత్యుః ధ్రువం జన్మ మృతస్యచ
తస్మాద పరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి

అర్థం: పుట్టినవాడికి మరణము తప్పదు, మరణించినవాడికి పుట్టుకా తప్పదు. ఈ విషయంలో నువ్వు బాధపడడం సరైనది కాదు.

ఈ రెండు శ్లోకాల ఛాయ ఆధునిక సైన్సులోని “లా ఆఫ్ కన్సెర్వేషన్ ఆఫ్ ఎనర్జీ” సూత్రంలో కనిపిస్తుంది.

ఆ సూత్రం చెప్పేది ఏమిటంటే: “ఒక ఐసోలేటెడ్ సిస్టం లో ఉన్న ‘ఎనెర్జీ’ పుట్టదు, చావదు. అది ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మాత్రం మారుతుంది” ( Law of conservation of energy: In an isolated system, the energy can neither be created nor destroyed, but it can only be transformed or transferred from one form to another)

ఇక్కడ ఎనెర్జీ అనే పదానికి బదులు ఆత్మ అనే పదం పెట్టుకుంటే గీతలో చెప్పిన అర్థమే వస్తోంది.

ఆత్మ కంటికి కనపడనట్టే ఎనెర్జీ కూడా కనపడదు.

ఆత్మ వలన రకరకాల జీవరాసుల శరీరాలు నడుస్తున్నట్టే, ఎనెర్జీ వలన యంత్రాలు నడుస్తాయి. వాటి ప్రవృత్తికి తగినట్టు ప్రవర్తిస్తాయి.

ఇంకాస్త వివరంగా చెప్పుకోవాలంటే, మన సౌరకుటుంబాన్ని ఒక ఐసోలేటెడ్ సిస్టం అనుకుందాం. “ఐసోలేటెడ్ సిస్టం” అంటే మిగతా వ్యవస్థల ప్రభావం లేకుండా దానికది స్వతంత్రంగా ఉన్న ఒక వ్యవస్థ. (“ఐసోలేషన్” అనే పదం “ఐసోలేషన్ వార్డులు” పుణ్యమాని కరోనా వైరస్ వచ్చిన తర్వాత బాగా పాపులర్ అయిన పదం. కనుక దీని అర్థం పెద్దగా వివరించక్కర్లేదు).

ఇక విషయంలోకి వస్తే… ఇక్కడి పంచభూతాల్లో అపారమైన ఎనెర్జీ ఉంది.

నీటి నుంచో, నిప్పునుంచో, గాలి-ఆకాశం-నేల నుంచో ఎలెక్ట్రికల్ ఎనెర్జీని వెలికితీస్తున్నాం (ఇక్కడ వెలికితీస్తున్నాం అనే చెప్పుకోవాలి…పుట్టించడం కాదు).

ఆ ఎలెక్ట్రికల్ ఎనెర్జీ అనేది ఒకటే. దాని నుంచి కొన్ని వోల్టుల ఎనెర్జీ ఫ్యాన్ లోకి ప్రవేశించి దానిని తిప్పుతుంది, అలాగే లైటుని వెలిగిస్తుంది, ఫ్రిజ్ ని చల్లబరుస్తుంది, హీటర్ ని వేడెక్కిస్తుంది, టెస్లా కార్లని నడుపుతుంది.

ఆయా యంత్రాలు ఏ ఉద్దేశ్యం కోసం డిజైన్ చేయబడ్డాయో అలా ప్రవర్తిస్తున్నాయి.

వాటిల్లోకి ప్రవేశించిన ఎలెక్ట్రికల్ ఎనెర్జీ మాత్రం ఒకటే. అది మెకానికల్ ఎనెర్జీగానో, హీట్ ఎనెర్జీగానో, కైనెటిక్ ఎనెర్జీగానో మారుతోంది అంతే.

ఆత్మ కూడా అంతే.

ఈ ఐసోలేటెడ్ సిస్టంలో ఉంటూనే రకరకాల శరీరాల్లోకి ప్రవేశిస్తోంది. ఆయా శరీరాలు ఏ విధంగా డిజైన్ చేయబడ్డాయో ఆ విధంగా చలిస్తున్నాయి.

శరీరాలు, యంత్రాలు ఇక్కడి పంచభూతాలతోనే తయారవుతున్నాయి. వేరే గ్రహం నుంచి దిగిరావట్లేదు అవి. వాటన్నిటిలోని ధాతువులు ఈ ఐసొలేటెడ్ సీస్టం లోనివే.

అయితే ఖర్చుపెట్టేసిన ఎనెర్జీ జీరో అయిపోతున్నట్టే కదా?

లేకపోతే “ఫ్యాను తిప్పటం” అనే పని చేసిన ఎనెర్జీ ఆ ఫ్యాన్ పాడైపోగానే ఏమౌతున్నట్టు?

ఈ ప్రశ్న తలెత్తవచ్చు.
దీనికి సమాధానం ఆలోచిద్దాం.

ఖర్చు పెట్టేసిన ఎనెర్జీ జీరో అయిపోతోందని మనకి అనిపిస్తోంది. కానీ దాని స్థానం మార్చుకుంటోంది అంతే.
ఫ్యానుని తిప్పిన ఎనెర్జీ గాలిని గిలక్కొట్టి ఆ అనంతవాయువులో కలిసిపోతుంది.
హీటరులోని నీటిని వేడెక్కించిన ఎనెర్జీ ఆ నీటిలో ఐక్యమైపోతోంది.
అలా ప్రతిదీ మళ్లీ ఈ ఐసోలేటెడ్ సిస్టం లోనే కలుస్తుంది. ఇంకెక్కడికీ పోదు.
అలాగే ఆత్మ కూడా శరీరం వదిలేయగానే ఈ ఐసోలేటెడ్ సిస్టం లోనే కలిసిపోతోంది.
ఎందుకంటే సైన్స్ సూత్రంప్రకారం ఐసోలేటెడ్ సిస్టం లో ఉన్న ఎనెర్జీ నాశనం చేయబడదు.

ఇంకొక చిన్న ఉదాహరణ…

మన ఎదురుగా గ్లాసులో ఉన్న నీరు ఎప్పుడో త్రేతాయుగంలో కూడా అలాగే గ్లాసులో ఉండి ఉండొచ్చు. అదెలాగో చూద్దాం.

నీరు వర్షం ద్వారా భూమిమీద పడుతోంది. కొంత ఇంకుతోంది, కొంత నదుల్లో కలుస్తోంది, కొంత సముద్రంలో కురుస్తోంది.

మళ్లీ వేడికి ఆవిరై నీరు మేఘంగా మారుతోంది.

ఇక ఇంకిన నీరు భూగర్భజలంగా కొన్నేళ్లు ఉండి బావుల ద్వారా మళ్లీ పైకొస్తోంది. అది కూడా ఆవిరై మేఘం అవుతోంది.

మేఘంగా మారిన నీరు మళ్లీ వానగా కురుస్తోంది.

మనం తాగిన నీరుకూడా భూగర్భంలోకి వెళ్లి ఫిల్టరై మళ్లీ స్వచ్ఛజలంగా మరలా మరలా భూమి మీదకే వస్తోంది.

నీటికి భూమి అనేది “ఐసొలేటెడ్ సిస్టం”.

ఇక్కడి నీరు ఇక్కడిక్కడే చక్కర్లు కొడుతుంది.

మధ్యలో కాసేపు మేఘంగా రూపం మార్చుకుంటోంది, సముద్రంలో ఉన్నప్పుడు ఉప్పగా ప్రవర్తిస్తోంది, నదిలో ఉన్నప్పుడు ప్రవాహంలా పరుగెడుతోంది, హిమాలయాల్లో ఉన్నప్పుడు గడ్డకట్టి కూర్చుంటోంది, భూగర్భంలో ఉన్నప్పుడు వెచ్చగా అనిపిస్తోంది.

కానీ అదే నీరు. ఇక్కడే ఉంటోంది. మళ్లీ మళ్లీ వస్తూనే ఉంది, రూపం మార్చుకుంటూనే ఉంది.
కనుక యుగాల క్రితం నాటి నీటి బొట్టు అనేక విధాలుగా రూపం మారి మనల్ని కూడా తాకి ఉండొచ్చు, మనం కూడా తాగి ఉండొచ్చు.

ఆ నీరు లాగానే ఈ ఐసోలేటెడ్ సిస్టం లో ఆత్మ కూడా ఉండాల్సిందే కదా!

నేను మాత్రం ఆత్మ ఉందని ప్రస్తుతానికి ఈ ఉదాహరణల ద్వారా నమ్ముతున్నాను. అయినా దీనిని కూడా కాంట్రడిక్ట్ చేసి మరింత వాదించుకోవచ్చు. లేదా ఏకీభవించి కొత్త ఉదాహరణలు చెప్పుకోవచ్చు.

అందుకే, ఇంతిలా చర్చించుకునే మనల్ని ఉద్దేశించే కాబోలు కృష్ణుడే ఇదే అధ్యాయంలో 29 వ శ్లోకం చెప్పాడు.

ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనమాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః
ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్

అర్థం: ఈ ఆత్మని ఒకడు ఆశ్చర్యంగా చూస్తాడు. ఒకడు ఆశ్చర్యంగా మాట్లాడతాడు. ఒకడు దీనిని గురించి ఆశ్చర్యంగా వింటాడు. అయినా ఎవడూ దీనిని సరిగా అర్థం చేసుకున్నవాడు లేడు

కనుక భగవద్గీత ఆత్మ ఉందని ఎంత ఘంటాపథంగా చెబుతోందో దానిని అర్థం చేసుకోవడం సులభం కాదని కూడా అంటే గట్టిగా చెబుతోంది.

ఆదిశంకరాచార్యుడు కూడా “శంకరభాష్యం”లో భగవద్గీతలోని ఆత్మ ప్రస్తావన గురించి ఇలా వివరించాడు- “ఒకదానినొకటి నాశనం చేసుకునే పంచభూతాలు కూడా ఆత్మను నాశనం చేయగల సామర్థ్యం లేనివి. కనుక ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. అంతటా ఉంటుంది. కనుక స్థిరంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఉంది. ఏదో ఒక కారణం చేత కొత్తగా పుట్టింది మాత్రం కాదు. ఆత్మ విషయంగా ఏమి చెప్పినా ఈ శ్లోకంలో చెప్పినదానికి మించి చెప్పడానికేమీ లేదు. పదే పదే కృష్ణుడు ఈ ఆత్మ గురించి చెప్పిందే చెబుతున్నట్టుగా చెబుతున్నాడు ఏమిటి అనుకోకూడదు. ఎప్పటికైనా మనిషికి అర్థం కావాలనే ఆలోచనతోనే ఒకటికి నాలుగు సార్లు చెబుతున్నాడాయన”.

తదుపరి వ్యాసంలో పార్లమెంటులో గొల్లుమన్న నవ్వుల మధ్య చప్పట్లు కొట్టించుకున్న ఒక మంచి భగవద్గీతా శ్లోకం గురించి చెప్పుకుందాం.

-సిరాశ్రీ