లవకుశ కథపై పెనుదుమారం…విచారణ

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే సప్తగిరి మాసపత్రిక వివాదంలో చిక్కుకుంది. సీతకు లవుడు ఒక్కడే కుమారుడని.. కుశుడు దర్భతో చేసిన బొమ్మ అంటూ సప్తగిరి మాసపత్రికలో ప్రచురితమైన కథనం పెనుదుమారం రేపుతోంది.

వాల్మీకి రాసిన రామాయణాన్ని వక్రీకరిస్తూ కథనం రాశారంటూ సప్తగిరి మాసపత్రిక, టీటీడీపై విమర్శలు వస్తున్నాయి. జానపద కథలో తిరుపతికి చెందిన తొమ్మిదో తరగతి బాలుడు పునీత్ రాసిన కథనంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ లాంటి ధార్మిక సంస్థ వాల్మీకి రాసిన రామాయణాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని బీజేపీ నేతలతో పాటు పలువురు డిమాండ్ చేశారు.

జానపదాల్లో రకరకాల ప్రచారాలపై ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రామాయణాన్ని తప్పుదారి పట్టించినట్లు అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కథనంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ సంస్కృతీ, సాంప్రదాయలు, దేవాలయాలు వంటి అంశాల్లో వరుసగా అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టీటీడీ సప్తగిరి మాస పత్రికలో ప్రచురితమైన రామాయణంలోని లవకుశ కథ వివాదాస్పదమైంది. సీతకు లవుడు మాత్రమే కుమారుడని, కుశుడు దర్బతో రాసిన బొమ్మ అంటూ ప్రచురించిన కథనం పెను దుమారం రేపుతోంది. ఈ కథ తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ కథపై బీజేపీ నేతలతో పాటు పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కథనంపై టీటీడీ విజిలెన్స్ రంగంలోకి దిగింది. సప్తగిరి పత్రిక ఎడిటర్ రాధా రమణ, ఎడిటర్, సబ్ ఎడిటర్‌లను విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఏ గ్రంధం ప్రాతిపదికన ఈ కథనాన్ని ప్రచురించారో తెలపాలని టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి అన్నారు.

ఎడిటర్ రాధా రమణను తొలగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ వెబ్‌సైట్‌లో వివాదాస్పదమైన ఈ కథనాన్ని తొలగించారు. ముద్రించిన పుస్తకాలను ప్రిటింగ్ ప్రెస్ నుంచి భక్తులకు పంపిణీ చేయకుండా నిలిపివేశారు. టీటీడీ భూముల వేలం వివాదం సద్దుమణుగుతుందనుకుంటున్న నేపథ్యంలో తాజా వివాదం చెలరేగడంతో టీటీడీ ఇరకాటంలో పడింది.