ఆగ్రరాజ్యాల్ని వణికిస్తున్న ‘ది గ్రేట్ రిజిగ్నేషన్’!

మహా ఉత్పాతం చోటు చేసుకున్న తర్వాత.. దాని ప్రభావం చాలాకాలం ఉంటుంది. యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా కలకలం నేపథ్యంలో ఇప్పుడు దాని ఎఫెక్టు పలు రంగాల మీద.. ఎన్నో విధాలుగా ఉంటోంది. ఇప్పుడు అలాంటిదే ఒకటి తెర మీదకు వచ్చింది. అదే.. ‘ది గ్రేట్ రిజిగ్నేషన్’ ట్రెండ్. నిజంగానే ప్రపంచ ప్రజల ఆలోచనా ధోరణిని ఈ మహమ్మారి మార్చేసింది. అప్పటివరకు జీవితాన్ని చూసిన తీరును కరోనా మార్చేసింది.

కొత్త జీవిత పాఠాలు ఎన్నింటినో నేర్పింది. కుటుంబ విలువను చెప్పటమే కాదు.. చేతిలో డబ్బులు లేకుంటే పరిస్థితులు ఎంత భయానకంగా ఉంటాయన్న విషయాన్ని తెలియజేయటమే కాదు.. సంపాదించిన డబ్బుల్ని పొదుపు అనేది లేకుండా ఖర్చు చేసేస్తే.. అందుకు ప్రతిఫలంగా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయాన్ని అర్థమయ్యేలా చేసింది. ప్రాణం విలువ ఏమిటో తెలియజేయటమే కాదు.. ఏదైనా సంక్షోభం ఏర్పడితే జీవితం ఎంత నరకప్రాయంగా మారుతుందన్న విషయాన్ని అర్థమయ్యేలా చేసింది.

దీంతో.. తాజాగా పలు అగ్ర రాజ్యాలు ‘ది గ్రేట్ రిజిగ్నేషన్’ సంక్షోభాన్ని చూస్తున్నాయి. ఇంతకీ ఇదేమిటన్న విషయంలోకి వెళితే.. చాలా కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు సంస్థలు జీతాల ప్యాకేజీలు పెంచెతున్నా.. వారు మాత్రం ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు. సరికొత్త ఉపాధి మార్గాల దిశగా అడుగులు వేస్తున్నారు. కరోనా శాంతించి.. ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి కుదుట పడుతూ.. వ్యాపారాలు పుంజుకుంటున్న వేళ.. ఉద్యోగుల్లో వచ్చిన మార్పే ఈ కొత్త ట్రెండ్ కు కారణంగా మారింది.

ఇంతకాలం తక్కువ వేతనాలకు సర్లేనని సర్దుకున్న వారంతా ఇప్పుడు అందుకు సిద్ధంగా ఉండటం లేదు. సింఫుల్ గా రిజైన్ చేసేస్తున్నారు. ఇలాంటివి రిటైల్.. రెస్టారెంట్లు..హెల్త్ కేర్.. వేర్ హౌస్ గోదాముల్లో పని చేసే ఉద్యోగులు రికార్డు స్థాయిలో ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ సర్దుకొని ఉద్యోగం చేస్తున్నా.. తక్కువ జీతాలు ఇస్తున్న తీరుపై వారు తిరుగుబాటు చేస్తున్నారు. తాజాగా టెక్సాస్ కు చెందిన ఒక మహిళ వాల్ మార్ట్ పై ఆరోపణలు చేస్తూ టిక్ టాక్ వీడియో పెట్టింది. దీంతో.. విషయాన్ని అర్థం చేసుకున్న సంస్థ చర్యలు చేపట్టినట్లు చెబుతున్నారు.

తాజాగా మొదలైన ఈ ట్రెండ్ ను గుర్తించిన సంస్థలు దిద్దుబాటు చర్యల్ని చేపట్టారు. అయినప్పటికీ అమెరికాలో మహిళా ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు. కరోనా పుణ్యమా అని.. పని వాతావరణం మరింత పెరగడం.. ఒత్తిడి పెరిగిపోవడంతో తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్న వైనం ఎక్కువైనట్లుగా స్టేట్ ఆఫ్ వర్క్ ఇన్ అమెరికా తాజా సర్వే స్పష్టం చేస్తోంది. ఒక్క అమెరికాలోనే గత ఆగస్టులో 43 లక్షల మంది తమ ఉద్యోగాలకు రిజైన్ చేశారు. దేశ ఉద్యోగాల్లో ఇది 2.9 శాతమని చెబుతున్నారు.

అమెరికాలోని ఉద్యోగుల్లో 50 శాతం మంది ఉద్యోగులు కొత్త కొలువుల కోసం చురుగ్గా ప్రయత్నాలు షురూ చేసినట్లు గాల్ అప్ సంస్థ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం మంది ఉద్యోగులు తాము చేస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేయటం లేదంటే కంపెనీ మారడం పైన ఆలోచిస్తున్నట్లుగా మైక్రోసాఫ్ట్ సర్వే గుర్తించింది. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా చరిత్రలోనే తొలిసారి రెస్టారెంట్లు.. బార్లలో పని చేసేవారి గంట వేతనం 15 డాలర్లకు చేరుకున్నట్లు చెబుతున్నారు. అమెరికాలోనే కాదు.. యూరప్ లోని పలు దేశాల్లో ఇలాంటి పరిస్థితే ఉందని చెబుతున్నారు. జర్మనీలో దాదాపు ఆరు శాతం మంది ఉద్యోగాలకు రిజైన్ చేశారంటున్నారు. తర్వాతి స్థానాల్లో బ్రిటన్.. నెదర్లాండ్స్.. ఫ్రాన్స్.. బెల్జియం దేశాలు నిలవడం గమనార్హం. కరోనా వేళ ఉద్యోగుల్ని ఆటాడుకున్న కంపెనీల్ని ఉద్యోగులు ఇప్పుడు ఫుట్ బాల్ ఆడేసుసుకుంటున్నారు. ఎదుటోళ్లకు ఒకటిచ్చాక..ప్రతిగా మరొకటి ఇవ్వకుండా ఊరుకుంటారా ఏంది?