వైజాగ్ లో ఎల్జీ ఎలక్ట్రానిక్స్

విశాఖపట్నం నగర శివార్లలోని ఎల్జీ పాలిమర్స్ లో గడచిన ఏడాదిలో స్టైరిస్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన అందరికీ గుర్తుంది కదా. తొందరలోనే ఎల్జీ పాలిమర్స్ ఉత్పత్తి స్ధానంలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తయారీకి రంగం రెడీ అయిపోయింది. పాలిమర్స్ ఉత్పత్తి చేయటం వల్లే గ్యాస్ లీకైన ఘటనలో 10 మంది చనిపోవటంతో పాటు అనేకమంది తీవ్రంగా అనారోగ్యం పాలయ్యారు. అప్పట్లో ఆ ఘటన యావత్ రాష్ట్రాన్ని కుదిపేసింది.

నిజానికి ఎప్పుడో 1960లో సంస్ధను ప్రారంభించినపుడు ఎల్జీ పాలిమర్స్ విశాఖకు నగరానికి దూరంగానే ఉండేది. కానీ తర్వాత పరిణామాల్లో పరిశ్రమ చుట్టుపక్కలంతా నగరం బాగా విస్తరించటంతో చివరకు పాలిమర్స్ సంస్ధ జనావాసాల మధ్యలో ఉన్నట్లయిపోయింది. దీనివల్లే గ్యాస్ విడుదలైనపుడు నేరుగా జనాల మీద ప్రభావం చూపింది. ఈ సమస్యను ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంది. అందుకనే వెంకటాపురంలోని పాలిమర్స్ ఉత్పత్తి యూనిట్ ను వెంటనే ఇక్కడి నుండి వేరే ప్రాంతానికి తరలించాలని డిసైడ్ అయ్యింది.

పాలిమర్స్ ఉత్పత్తి యూనిట్ ను ఖాళీ చేసి ఈ ప్లేసులో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలను ఉత్పత్తి చేయటానికి ఎల్జీ యాజమాన్యం డిసైడ్ అయ్యింది. ఎలక్ట్రానిక్స్ అంటే టీవీలు, మొబైళ్ళు, రెఫ్రిజిరేటర్లు, ల్యాప్ టాపులు, చార్జర్లు తదితరాలన్నమాట. ఇక్కడి నుండి తరలించబోయే పాలిమర్స్ యూనిట్ ను నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం మండలంలో ఏర్పాటు చేయబోతున్నారట.
ప్రభుత్వం చూపించిన స్ధలానికి ఎల్జీ యాజమాన్యం కూడా ఓకే చెప్పిందని సమాచారం. కాబట్టి తొందరలోనే నెల్లూరు జిల్లాకు మరో పరిశ్రమ రావటం ఖాయమైంది. అంటే ఇటు విశాఖ జిల్లా అటు నెల్లూరు జిల్లా ప్రజలు హ్యపీ అనే చెప్పాలి. కాకపోతే మళ్ళీ కృష్ణపట్నంలో యూనిట్ మొదలైన తర్వాత ప్రమాదం జరగకుండా యాజమాన్యం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.