థర్డ్ వేవ్ రాదు.. వచ్చినా ఏం కాదట..!

కరోనా మహమ్మారి మన దేశంలో ఎంతలా కలకలం రేపిందో మనందరికీ తెలిసిందే. సెకండ్ వేవ్ అయితే.. మరింత అతలాకుతలం చేసేసింది. యువకులు సైతం ప్రాణాలు కోల్పోయారు. కాగా.. త్వరలోనే థర్డ్ వేవ్ కూడా రానుందని… అది ముఖ్యంగా పిల్లలపై ప్రభావం చూపించనుందనే ప్రచారం జరుగుతోంది. కాగా.. దీనిపై ఐసీఎంఆర్ నివేదిక విడుదల చేసింది.

థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు అంచనా వేసినా.. ఐసీఎంఆర్ మాత్రం ఛాన్స్ లేదని అంటోంది. ఒకవేళ వచ్చినా రెండో వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని చెబుతోంది.

ఉపద్రవాన్ని ఎదుర్కోవడంలో వేగంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషిస్తుందని ఐసీఎంఆర్ తెలిపింది. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ ఇతర వైద్య నిపుణులతో కలిసి అధ్యయనం చేశారు. థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు తక్కువేననే విషయం ఈ అధ్యయనంలో తేలింది. అంతేకాదు… కేవలం పిల్లలపైనే ప్రభావం చూపుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు.

సెకెండ్ వేవ్ కొన‌సాగుతున్న సమయంలోనే జనాభాలో 40 శాతం మంది రెండు మోతాదుల టీకా తీసుకున్నారు. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగితే థర్డ్ వేవ్ వచ్చే ఛాన్స్ లేదని చెబుతున్నారు నిపుణులు. ఈ అధ్యయనం కోసం SARS-CoV-2 ట్రాన్స్మిషన్ యొక్క కంపార్ట్మెంటల్ మోడల్ ఉపయోగించి.. మూడో వేవ్ కు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అయితే కొన్ని కారణాలతో థర్డ్ వేవ్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు పరిశోధకులు.