పాయె.. ప్రపంచకప్ కూడా పాయె

పోయినేడాది కరోనా ఫస్ట్ వేవ్ టైంలో ఐపీఎల్‌ను వాయిదా వేసి, స్వదేశం నుంచి తరలించి.. యూఏఈలో ఏ ఇబ్బందీ లేకుండా నిర్వహించింది బీసీసీఐ. టోర్నీ ముందు లీగ్ పరిధిలో కొన్ని కరోనా కేసులు బయటపడటం కొంత కలకలం రేపినా.. ఆ తర్వాత కట్టుదిట్టమైన చర్యలతో లీగ్‌ను సురక్షితంగా పూర్తి చేశారు. కానీ ఇవే కట్టుదిట్టమైన చర్యలు ఈసారి స్వదేశంలో కొరవడ్డాయి. ఐపీఎల్ మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడిక స్వదేశంలో టోర్నీని కొనసాగించే పరిస్థితి లేక, లీగ్‌కు విండో దొరక్క ఇబ్బంది పడుతోంది బీసీసీఐ.

చివరికి సెప్టెంబరులో ఎలాగైనా యూఏఈ వేదికగా లీగ్‌ మిగతా భాగాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది బీసీసీఐ. ఐపీఎల్ తరలిపోతే తరలిపోయింది.. కనీసం ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ అయినా అక్టోబరు-నవంబరు నెలల్లో స్వదేశంలో ఏ ఇబ్బందీ లేకుండా జరిగే చాలని అనుకుంటూ వచ్చింది బీసీసీఐ. కానీ ఇప్పుడు ఆ ఆశ కూడా పోయింది.

టీ20 ప్రపంచకప్‌ను కూడా భారత్ నుంచి తరలించక తప్పని పరిస్థితి నెలకొంది. కరోనా సెకండ్ వేవ్‌లో ప్రపంచంలో అత్యధికంగా నష్టపోయింది భారతే. గత రెండు నెలలుగా సాగుతున్న కరోనా విలయం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐతే ఇప్పుడు కేసులు కొంచెం తగ్గినా, వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున జరుగుతున్నా.. ఎప్పటికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయో తెలియట్లేదు. ఈ టోర్నీని ఏ ఇబ్బంది లేకుండా నిర్వహించగలరో లేదో ఈ నెలాఖరు లోపు చెప్పాలని బీసీసీఐకి ఐసీసీ అల్టిమేటం విధించిందట.

ఐతే అక్టోబరు నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితిలో బీసీసీఐ ఎటూ తేల్చుకోలేకపోతోంది. అసలు గత రెండు నెలల పరిస్థితులు చూశాక భారత్‌లో టీ20 ప్రపంచకప్ ఆడటానికి విదేశీ జట్లు ముందుకొస్తాయో లేదో అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ స్వదేశంలో టోర్నీ నిర్వహించే విషయంలో నమ్మకంతో లేదని, ఐసీసీకి ఈ విషయమై ఇప్పటికే సమాచారం ఇచ్చేసిందని.. భారతే ఆతిథ్య హోదాలో యూఏఈలో టోర్నీ నిర్వహించడానికి ఐసీసీ కూడా సిద్ధమైందని.. ఈ మేరకు వివిధ దేశాలకు అనధికారికంగా సంకేతాలు ఇచ్చిందని.. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీని స్వదేశంలో నిర్వహించే అవకాశాన్ని భారత్ కోల్పోయినట్లే అని అంటున్నారు.