సుశీల్ మెడ‌కు చుట్టుకున్న ఆ వీడియో

ఒలింపిక్స్‌లో ఒక పతకం గెలిస్తేనే గొప్పగా చూస్తారు అందరూ. అలాంటిది ఒకటికి రెండు పతకాలు సాధించి దేశం గర్వించేలా చేశాడు సుశీల్ కుమార్. భారత్‌లో రెజ్లింగ్ క్రీడకు గత కొన్నేళ్లలో గొప్ప ఊపు రావడానికి అతనే ప్రధాన కారణం అంటే అతిశయోక్తి కాదు. వరుసగా బీజింగ్ (2008), లండన్ (2012) ఒలింపిక్స్‌లో కాంస్య, రజత పతకాలు గెలిచి చరిత్ర సృష్టించాడతను. ఓ వైపు క్రీడాకారుడిగా కొనసాగుతూనే.. ఎందరో యువ రెజ్లర్లకు మార్గ నిర్దేశం చేస్తూ దిగ్గజ హోదాను అందుకున్నాడతను.

ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న అతను ఇప్పుడు ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటూ.. దాదాపు 20 రోజుల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగి, చివరికి వారికి పట్టుబడ్డాడు. ముఖానికి ముసుగేసి పెద్ద క్రిమినల్స్‌ను తీసుకొచ్చినట్లే పోలీసులు అతణ్ని తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. ఇది చూసి సుశీల్ అభిమానులకు మనసు చివుక్కుమంది.
ఇక ఈ హత్య కేసు విషయానికి వస్తే.. సాగర్ రాణా అనే 23 ఏళ్ల యువ రెజ్లర్‌తో గతంలో సుశీల్‌కు ఓ గొడవ జరిగింది. అతను సుశీల్ ఇంట్లోనే అద్దెకుండేవాడు. దాన్ని ఖాళీ చేయమని సుశీల్ అడిగినపుడు ఇద్దరికీ గొడవ జరిగింది.

సుశీల్‌ను పబ్లిగ్గా బూతులు తిట్టడంతో అతడిపై కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. తర్వాత తన మిత్రులతో కలిసి ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియం ముందు సాగర్, అతడి ఇద్దరు స్నేహితుల మీద హాకీ, బేస్‌బాల్ బ్యాట్లతో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాల పాలైన సాగర్ ప్రాణాలు వదిలాడు. కాగా ఇది జరిగిన రెండు రోజులకు ప్రిన్స్ అనే సుశీల్ స్నేహితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తన మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. అందులో సుశీల్ స్వయంగా సాగర్, అతడి మిత్రులపై దాడి చేస్తున్న దృశ్యాలున్నాయట.

పోలీసు విచారణలో భాగంగా తేలిందేమంటే.. తనంటే రెజ్లింగ్ వర్గాల్లో భయం పుట్టాలని, సాగర్ లాగా ఇంకెవరూ తనకు ఎదురు తిరగకూడదనే ఉద్దేశంతో సుశీల్ స్వయంగా ప్రిన్స్‌కు చెప్పి ఈ వీడియో తీయించాడట. ఇదే మాట కోర్టులో పోలీసులు చెప్పడం గమనార్హం. సాగర్ చనిపోకున్నా సరే.. ఈ వీడియో బయటికి వస్తే తనకు ఎంత చెడ్డ పేరు వస్తుందో సుశీల్ అంచనా వేయలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. అప్పుడతను అదే పనిగా తీయించిన వీడియోనే ఇప్పుడు హత్య కేసులో సాక్ష్యంగా మారి సుశీల్ మెడకు చుట్టుకోవడం గమనార్హం.