వైట్ ఫంగస్ కలకలం..బ్లాక్ కంటే డేంజరట

అసలే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ను జనాలు తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో బ్లాక్ ఫంగస్ సోకటం మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయ్యింది. బ్లాక్ ఫంగస్ కేసులతోనే కరోనా వైరస్ రోగులు ఇబ్బందులు పడుతుంటే తాజాగా దానికన్నా ప్రమాధకరమైన వైట్ ఫంగస్ కేసులు వెలుగుచూడటం కలకలం రేపుతోంది.

బీహార్ లోని పాట్నా మెడికల్ కాలేజీలో నాలుగు వైట్ ఫంగస్ కేసులు బయటపడటంతో డాక్టర్లు ఉలిక్కిపడ్డారు. వీరిలో కరోనా వైరస్ లక్షణాలు మాత్రమే ఉన్నాయి. పైగా వీరికి టెస్టులు చేయిస్తే కరోనా నెగిటివ్ అనే వచ్చింది. అయినా వీరిలో వైట్ ఫంగస్ ఎలా వచ్చిందో డాక్టర్లకు అర్ధం కావటంలేదు.

ఇదే విషయమై మైక్రో బయాలజీ హెడ్ డాక్టర్ ఎస్ఎస్ సింగ్ మాట్లాడుతు తాజాగా వెలుగు చూసిన వైట్ పంగస్ కేసులు బ్లాక్ పంగస్ కేసులకన్నా చాలా ప్రమాధకరమన్నారు. కరోనా వైరస్ లేకపోయినా నలుగురికి వైట్ ఫంగస్ సోకటమే తమను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. యాంటీ ఫంగల్ మందులు వాడుతున్న కారణంగా ప్రస్తుతానికైతే నలుగురు క్షేమంగానే ఉన్నారన్నారు.

కరోనా వైరస్ సోకినపుడు రోగుల్లో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనబడినట్లే వైట్ ఫంగస్ సోకిన రోగుల్లో కూడా ఇవే లక్షణాలు బయటపడ్డాయన్నారు. తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారిలోను, షుగర్, స్టెరాయిడ్లు వాడిన, వాడుతున్న వారిలో వైట్ ఫంగస్ లక్షణాలు ఎక్కువగా బయటపడే అవకాశాలున్నట్లు సింగ్ తెలిపారు. ఏదేమైనా ముందు కరోనా వైరస్ తర్వాత బ్లాక్ ఫంగస్ తాజాగా వైట్ పంగస్ జనాలను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి.