హైద‌రాబాద్ క్రికెట‌ర్‌ను ఆదుకున్న కోహ్లి


స్ర‌వంతి నాయుడు అని హైద‌రాబాద్ మ‌హిళా క్రికెట‌ర్. ప్ర‌స్తుతం ఆమె వ‌య‌సు 34 ఏళ్లు. క్రికెట్ నుంచి కొన్నేళ్ల కింద‌టే రిటైరైంది. భార‌త జ‌ట్టు త‌ర‌ఫున ఆమె ఒక టెస్టు మ్యాచ్‌, నాలుగు వ‌న్డేలు, ఆరు టీ20లు ఆడింది. హైద‌రాబాద్ క్రికెట్ వ‌ర్గాల్లో స్ర‌వంతి పేరు బాగానే పాపుల‌ర్. ఇప్పుడు ఆమెకు పెద్ద క‌ష్టం వ‌చ్చింది. స్ర‌వంతి త‌ల్లిదండ్రులు ఇద్ద‌రూ క‌రోనా బారిన ప‌డ్డారు. త‌ల్లి ప‌రిస్థితి విష‌మంగా త‌యారైంది. వెంటిలేట‌ర్ మీద చికిత్స అందిస్తున్నారు. స్ర‌వంతి తండ్రి కూడా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. వీరి చికిత్స కోసం స్ర‌వంతి ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బుల‌న్నీ ఖ‌ర్చు చేసింది. ఇప్ప‌టికే రూ.16 ల‌క్ష‌ల మేర ఖ‌ర్చయింది. అయినా త‌ల్లిదండ్రుల ప‌రిస్థితి మెరుగ‌ప‌డ‌లేదు. చికిత్స‌కు ఇంకా చాలా ఖ‌ర్చ‌వుతుంద‌ని తేలింది.

దిక్కు తోచ‌ని స్థితిలో ఉన్న స్ర‌వంతి గురించి ఓ మాజీ క్రికెట‌ర్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ప్ర‌స్తుతం క‌రోనా బాధితులకు సోష‌ల్ మీడియా ద్వారా గొప్ప తోడ్పాటు అందిస్తున్న క్రికెట‌ర్‌ హ‌నుమ విహారి, బ్యాడ్మింట‌న్ తార గుత్తా జ్వాల లాంటి వాళ్లు స్ర‌వంతి గురించి పోస్టులు పెట్టారు. దీంతో విష‌యం బీసీసీఐ వ‌ర‌కు వెళ్లింది. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి కూడా విష‌యం తెలిసింది. ఇప్ప‌టికే కోవిడ్‌పై పోరాటానికి భార్య‌తో అనుష్క శ‌ర్మ‌తో క‌లిసి రూ.2 కోట్లు ఇవ్వ‌డంతో పాటు మొత్తం రూ.11 కోట్ల విరాళాలు సేక‌రించిన కోహ్లి.. స్ర‌వంతిని ఆదుకోవ‌డానికి ముందుకు వ‌చ్చాడు. రూ.6.77 ల‌క్ష‌ల సాయం ఆమెకు అంద‌జేశాడు.

మ‌రోవైపు బీసీసీఐ సూచ‌న మేర‌కు హైద‌రాబాద్ క్రికెట్ సంఘం స్ర‌వంతికి రూ.5 ల‌క్ష‌లు కేటాయించింది. అందులో మూడు ల‌క్ష‌లు ఇప్ప‌టికే ఆమె చేతికి అందాయి. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న త‌న‌కు ఇలా వివిధ మార్గాల నుంచి సాయం అందుతుండ‌టంతో ఇక డ‌బ్బుల గురించి టెన్ష‌న్ ప‌డ‌టం మాని త‌ల్లిదండ్రులు కోలుకోవ‌డం గురించి దృష్టిసారించే అవ‌కాశం ల‌భించింది స్ర‌వంతికి.