ఆ గ్రామంలోకి కరోనా కూడా ఎంటర్ కాలేకపోయింది

అవును యావత్ ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఒక గ్రామంలోకి మాత్రం ప్రవేశించలేకపోయిందట. ఇందుకు కారణం ఏమిటంటే గ్రామంలోని జనాలందరు ఒకే కట్టుబాటుమీద నిలబడటం. ఎవరు తమ గ్రామంలోకి రావద్దు..తామెవరము గ్రామం దాటి వయటకు వెళ్ళకూడదు అనే కట్టుబాటును స్ట్రిక్టుగా అమలు చేయటం వల్ల కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉధృతిలో ఒక్క కేసుకూడా నమోదు కాలేదట.

కృష్ణాజిల్లాలోని జీకొండూరు మండలంలోని దుగ్గిరాలపాడు గ్రామం గురించే ఇదంతా. ప్రపంచాన్ని కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కబళించటం మొదలవ్వగానే మొన్నటి మార్చిలో గ్రామంలోని పెద్దలంతా సమావేశమయ్యారట. గ్రాస్తులెవరు గ్రామ సరిహద్దులు దాటి బయటకు వెళ్ళకూడదని తీర్మానించారట. అలాగే బయటవారు ఎవరినీ తమ గ్రామంలోకి రావద్దని స్పష్టంగా చెప్పేశారట. గ్రామం బయటుంటున్న కుటుంబ సభ్యులు, బంధువులను కూడా రావద్దని ఫోన్ ద్వారా చెప్పేశారట.

గ్రామ పంచాయితిలో 8 వార్డులున్నాయట. అలాగే గ్రామంలో ఎనిమిది కిరాణా షాపులున్నాయట. పంచాయితి జనాల్లో 80 శాతం వ్యవసాయం పై ఆధార పడ్డ వారే. వీరిలో కూడా వ్యవసాయ కూలీలే అత్యధికం. మరి ఇలాంటి వాళ్ళను పనులకు బయటకు వెళ్ళద్దంటే వాళ్ళకు రోజు గడిచేదెలా ? అందుకనే రోజువారి కూలీకి వెళ్ళే వాళ్ళకోసమని గ్రామంలోనే గ్రామీణ ఉపాధి హామీ పనులు మొదలుపెట్టారు. పంచాయితి అధికారులను ఒప్పించి ఉపాధి హామీ పనులను మంజూరు చేయించుకుని మొదలుపెట్టేశారట.

రోజు వారి సరుకులు, కూర గాయలు అవసరమైన వాళ్ళు ఒకేసారి షాపుల దగ్గరకు రానీయకుండా వార్డుల వారీగా రోజుకో వార్డులోని జనాలు కొనుగోళ్ళు చేసేలా తీర్మానించారు. ఇలాంటి అనేక తీర్మానాలను గట్టిగా అమలు చేస్తున్న కారణంగానే మొన్నటి మార్చి నుండి దుగ్గిరలపాడు గ్రామంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదట. తీర్మానాలు చేయటమే కాకుండా చేసుకున్న తీర్మానాలను తూచా తప్పకుండా పాటిస్తున్న గ్రామస్తులను అభినందించాల్సిందే.