ఇండియాలోకి మూడో వ్యాక్సిన్ వచ్చేస్తోంది


ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ మొదలై మూడు నెలలు దాటింది. ముందు నుంచి ఇక్కడ ఉత్పత్తి అవుతున్నవి, వ్యాక్సినేషన్ మొదలయ్యాక జనాలకు ఇస్తున్నవి కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు మాత్రమే. వీటిలో కోవాగ్జిన్ ఉత్పత్తి మరీ తక్కువగా ఉండగా.. దాంతో పోలిస్తే ఉత్పత్తి మూడు రెట్లు ఎక్కువ ఉన్నప్పటికీ కోవిషీల్డ్ ఇక్కడి డిమాండుకు సరిపోవట్లేదు. వ్యాక్సినేషన్ మొదలైన కొత్తలో కరోనా ప్రభావం తక్కువగా ఉండేసరికి టీకా వేయించుకోవడానికి జనాలు అంతగా ఆసక్తి చూపించలేదు. ఆ సమయంలో ప్రభుత్వం సైతం నిర్లక్ష్యం వహించింది.

దేశంలో ఉన్న వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచడంలో కానీ, విదేశీ వ్యాక్సిన్లకు అనుమతులిచ్చి భారత్‌కు తీసుకురావడంలో కానీ చొరవ చూపించలేదు. కానీ చూస్తుండగానే వైరస్ ఉద్ధృతి పెరిగిపోయింది. వ్యాక్సిన్ కోసం డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఆశగా విదేశీ వ్యాక్సిన్ల వైపు చూస్తున్నారు.

ఇండియా ఎదురు చూపులు ఫలించి ఎట్టకేలకు కొత్తగా ఒక విదేశీ వ్యాక్సిన్ భారత్‌లో అడుగు పెడుతోంది. రష్యా అభివృద్ధి చేసి, ఆ దేశ ప్రజలకు అందిస్తున్న ‘స్పుత్నిక్-వి’ వ్యాక్సిన్ డోసులు భారత్‌లోకి దిగుమతి అయ్యాయి. రష్యా తయారు చేసిన స్పుత్నిక్-వి టీకాను ఇండియాలో పంపిణీ చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఒప్పందం చేసుకోవడం తెలిసిందే. ఆ సంస్థకు అనుమతులు కూడా లభించాయి.
భారత్‌లోకి స్పుత్నిక్-వి డోసులు ఓ మోస్తరు స్థాయిలోనే వచ్చాయి. హైదరాబాద్‌కు లక్షన్నర దాకా డోసులు చేరుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా కొన్ని టీకా డోసులను పరిశీలనకు ఉపయోగించే అవకాశముంది. వ్యాక్సిన్ వేసుకున్న వెంటనే మన జనాల్లో దుష్పరిణామాలు ఏమైనా తలెత్తుతున్నాయేమో చూసి.. ఆ తర్వాత టీకా కేంద్రాలకు డోసులు పంపించనున్నారు. వచ్చే వారం నుంచే ‘స్పుత్నిక్-వి’ వ్యాక్సినేషన్ ఆరంభం కానున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు కోవాగ్జిన్, కోవిషీల్డ్ ఉత్పత్తి కూడా పెంచుతుండటంతో త్వరలోనే టీకా కొరత కొంతమేర తగ్గుతుందని భావిస్తున్నారు. ఫైజర్ సహా మరికొన్ని విదేశీ టీకాలు త్వరలోనే భారత్‌కు వచ్చే అవకాశాలున్నాయి.