ఐపీఎల్‌లోకి కరోనా.. అసలెలా వచ్చింది?

ఈసారి ఐపీఎల్ ఆరంభం కావడానికి ముందే లీగ్ పరిధిలో 40కి పైగా కరోనా కేసులు బయటపడ్డాయి. అక్షర్ పటేల్, దేవ్‌దత్ పడిక్కల్, నితీశ్ రాణా, నార్జ్, డేనియల్ సామ్స్.. ఇలా పలువురు ఆటగాళ్లు కూడా ఉన్నారు ఈ జాబితాలో. వీరు కాక ముంబయిలోని వాంఖడె స్టేడియం సిబ్బందిలో పలువురు పాజిటివ్‌గా తేలారు. అలాగే లీగ్ బ్రాడ్‌కాస్టర్ అయిన స్టార్ స్పోర్ట్స్‌కు చెందిన సిబ్బందిలోనూ పలువురు కరోనా బారిన పడ్డారు.

ఐతే వీళ్లందరినీ క్వారంటైన్‌కు పంపి.. వీరి నుంచి ఇంకెవరికీ కరోనా సోకకుండా పకడ్బందీగానే వ్యవహరించారు నిర్వాహకులు. టోర్నీ ఆరంభమయ్యాక కరోనా భయం లేకపోయింది. కరోనా చైన్‌ను విజయవంతంగా తెంచేశారని.. ఇక బయో బబుల్ పరిధిలోకి బయటి వారు ఎవరూ రారు కాబట్టి కరోనా భయం లేనట్లే అని అంతా అనుకున్నారు. మూడు వారాల పాటు ఏ ఇబ్బందీ లేకుండా మ్యాచ్‌లు సాగిపోయాయి. ఇలాగే టోర్నీ అంతా సాగిపోతుందని అనుకున్నారు.

కానీ కట్ చేస్తే.. లీగ్ మధ్య దశలో ఉండగా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజు వ్యవధిలో కథ మొత్తం మారిపోయింది. లీగ్‌నే ఆపేయాల్సి వచ్చింది. మరి పక్కాగా బయో బబుల్లో నిర్వహిస్తున్న టోర్నీలోకి కరోనా ఎలా ప్రవేశించిందన్నది అర్థం కాని విషయం. ఇందుకు ప్రధానంగా కనిపిస్తున్న కారణం.. ముంబయి, చెన్నైల్లో తొలి దశ మ్యాచ్‌లను ముగించుకున్నాక వారం కిందట ఆటగాళ్లు, ఇతర సిబ్బంది అందరూ విమానాల్లో ప్రయాణించి అహ్మదాబాద్‌, ఢిల్లీలకు చేరుకోవడమే. మ్యాచ్‌లను సాధ్యమైనంత తక్కువ వేదికల్లో పూర్తి చేయాల్సిన బీసీసీఐ.. ఆరు వేదికలను ఎంచుకుంది. మూడు దశల్లో మ్యాచ్‌లు నిర్వహించాలనుకుంది. విమాన ప్రయాణాలు చేస్తే కరోనా సోకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించినా పట్టించుకోలేదు. పీపీఈ కిట్లు వేసుకుని ఆటగాళ్లు ప్రయాణించినా సరే.. ఫలితం లేకపోయింది. బబుల్లోకి కరోనా వచ్చేసింది.

ఇక కోల్‌కతా ఆటగాడు వరుణ్ చక్రవర్తి మధ్యలో మోకాలి గాయానికి స్కానింగ్ చేసుకోవడానికి బయటికి వెళ్లి వచ్చాడని అంటున్నారు. తిరిగొచ్చాక అతను క్వారంటైన్లో ఉండకుండా నేరుగా మ్యాచ్ ఆడేశాడు. అతను బయటి నుంచి కరోనా అంటించుకు వచ్చాడో ఏమో.. తన రాష్ట్రం అయిన తమిళనాడుకే చెందిన సందీప్ వారియర్‌కు కూడా అంటించాడు. గత ఏడాది యూఈఏలో ఓ ప్రైవేటు సంస్థకు బయో బబుల్ బాధ్యతలు అప్పగిస్తే ఎక్కడా తేడా రాకుండా పకడ్బందీగా.. బబుల్‌‌ను నిర్వహించారు. ఈసారి బీసీసీఐ సొంతంగా బబుల్ ఏర్పాట్లు చూసుకుని పీకల మీదికి తెచ్చుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.