అంత పెద్ద ప్రొఫెసర్.. ఎంత దారుణంగా మరణించారంటే?

ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో పరిస్థితులు ఎంత తీవ్రంగా.. మరెంత దారుణంగా ఉన్నాయన్న విషయం కళ్లకు కట్టినట్లుగా తెలిపే ఉదంతంగా దీన్ని చెప్పాలి. రోజులు గడుస్తున్న కొద్దీ దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసులు.. అందుకు తగ్గట్లు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందని దుస్థితి. దీంతో.. ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. సామాన్యుల సంగతి తర్వాత.. సమాజంలో గుర్తింపు.. గౌరవంతో పాటు.. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేని వారికి సైతం వైద్య సదుపాయం అందటం లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

గుజరాత్ కు చెందిన ఇంద్రాణీ బెనర్జీ మరణించిన వైనం తెలిస్తే నోట మాట రాదంతే. ఈ ప్రొఫెసర్ ప్రొఫైల్ మామూలుగా ఉండదు. ఆమె బార్క్ లో ఫెలో.. కాలిఫోర్నియా వర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్. అలాంటి ఆమె గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీలో నానో సైన్సెస్ విభాగంలో డీన్ గా వ్యవహరిస్తుంటారు. అలాంటి ఆమె.. కరోనా పాజిటివ్ గా తేలింది.

శ్వాస సమస్య తలెత్తటంతో ఆమెను తొలుత గాంధీ నగర్ సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ రద్దీగా ఉండటం.. బెడ్లు లేకపోవటంతో.. ప్రైవేటు ఆసుపత్రికి మార్చారు. అయితే.. అక్క ఆక్సిజన్ కాన్సట్రేటర్.. వెంటిలేటర్ లేదని చెప్పటంతో సొంత వాహనంలోనే అహ్మదాబాద్ కార్పొరేషన్ ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆ ఆసుపత్రి వారు ఆమెను చేర్చుకోలేదు.

దీనికి కారణంగా.. ఆమెను అంబులెన్సులో తీసుకురాలేదని చెప్పారు. దీంతో.. మళ్లీ గాంధీనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొద్దిసేపటికే ఆమె మరణించారు. అన్ని హంగులు ఉండి కూడా.. వైద్యసాయానికి అవసరమైన సదుపాయాలు లేకపోవటంతో.. ఆమె ప్రాణాలు విడవక తప్పలేదు. ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉండటం దేనికి నిదర్శనం?