పక్కా ప్లాన్ తోనే మావోయిస్టుల దాడి ?

అవును ఛత్తీస్ ఘడ్ తరెం అటవీప్రాంతంలో సీఆర్పీఎఫ్ పోలీసులపై మావోయిస్టులు విసిరిన పంజాకు సుమారు 25 మంది జవాన్లు బలైపోయారు. ఇపుడీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది కాబట్టి చనిపోయిన వారిసంఖ్య 25 అని చెప్పేందుకు లేదు. నిజానికి తెలుగురాష్ట్రాల్లోని గ్రేహౌండ్స్ పోలీసులకు మావోయిస్టుల ఏరివేతలో ప్రత్యేకమైన ట్రైనింగ్ ఉంది. సీఆర్పీఎఫ్ పోలీసులకు గ్రేహౌండ్స్ తరహా ట్రైనింగ్ లేదనే చెప్పాలి.

అయినా సరే మావోయిస్టులను వెతుక్కుంటు సీఆర్పీఎఫ్ జవాన్లు అడవుల్లోకి వెళ్ళనిందుకు భారీ జరిమానానే చెల్లించుకోవాల్సొచ్చింది. నిజానికి ఇక్కడ జరిగిందేమంటే సీఆర్పీఎఫ్ జవాన్లను మావోయిస్టులు ఓ ప్లాన్ ప్రకారం ఉచ్చులోకి లాగారు. తమకు తెలియకుండానే ముందు వెనక చూసుకోకుండా జవాన్లు మావోయిస్టుల ఉచ్చులో ఇరుక్కుపోయారు. దాంతో భారీసంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.

ప్రతి ఏడాది జనవరి-జూలై మధ్య మావోయిస్టులు కొత్త రిక్రూట్లు చేస్తుంటాయి. అలాగే అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంటాయి. వాటి పనితీరు, ఉపయోగించే విధానాలపై దట్టమైన అడవుల్లో ట్రైనింగ్ తీసుకుంటాయి. ఇందులో భాగంగానే తరెం అడవుల్లో కొన్నిరోజులుగా మావోయిస్టు అగ్రనేతలు మకాం వేశారు. ట్రైనింగ్ పూర్తిచేసుకుని ప్రాక్టికల్స్ చేద్దామని తీర్మానించుకున్నాయి.

తీర్మానంలో భాగంగా వ్యూహాత్మకంగా అటవీప్రాంతాల్లోని ఒకరిద్దరు అమయాకులను కాల్చి చంపేశాయి. దాంతో విషయం తెలుసుకున్న జవాన్లు వెంటనే మావోయిస్టులను వేటకోసం అడవుల్లోకి వెళ్లారు. వాళ్ళ వస్తున్న విషయం, ఏ దారిలో వస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్న మావోస్టులు షెల్టర్ జోన్లలో కాపుకాచారు. తమ టార్గెట్లోకి జవాన్లు చేరుకున్నారని నిర్ధారించుకోగానే వెంటనే కాల్పులు మొదలుపెట్టారు.

మావోయిస్టుల నుండి ఊహించని రీతిలో కాల్పులు మొదలయ్యేసరికి తేరుకోవటానికే చాలా సమయం పట్టింది. సమయం తీసుకున్నా షెల్టర్ తీసుకోవటానికి అవకాశం కూడా జవాన్లకు లేకుండాపోయింది. దాంతోనే భారీగా ప్రాణాలు కోల్పోవాల్సొచ్చింది. నిజానికి ఇద్దరిని మావోయిస్టులు కాల్చి చంపేసిన సమాచారం, మావోయిస్టులు ఎక్కడున్నారనే సమాచారన్ని జవాన్లకు చేరవేసింది కూడా మావోయిస్టులే. అయితే ఇలాంటి గెరిల్లా యుద్ధాల్లో అనుభవం లేని జవాన్లు మావోయిస్టులను మట్టుపెట్టేందుకు అడవుల్లోకి వెళ్ళి చివరకు తామే బలైపోయారు.