కరోనా టీకా వృథా అవుతోందట

ప్రపంచమంతా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుంటే తెలుగురాష్ట్రాల్లో మాత్రం కరోనా వైరస్ టీకా వృధా అవుతోంది. గడచిన ఏడాదిగా యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికించేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు పదిమాసాల తర్వాత వైరస్ కు విరుగుడు టీకాను కొన్ని ఫార్మాకంపెనీలు తయారుచేశాయి. టీకాను వేసుకోవటానికి కూడా కోట్లాదిమంది జనాలు ఎదురుచూస్తున్నారు.

ఇలాంటి నేపధ్యంలోనే మనదేశంలో కూడా వ్యాక్సినేషన్ మొదలైంది. ఇందులో భాగంగానే తెలుగురాష్ట్రాల్లో 10 శాతం టీకాలు వృధా అవుతున్నట్లు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడినే ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రులతో జరిపిన సమావేశంలో మోడి మాట్లాడుతూ దేశం మొత్తం మీద మూడు రాష్ట్రాల్లో టీకా వృధా అవుతున్నట్లు చెప్పారు.

యావత్ ప్రపంచం టీకా కోసం ఎదురుచూస్తున్న సమయంలో మన దగ్గర టీకా వృధా అవటం చాలా ఆందోళనగా ఉందన్నారు. టీకావృధా ఏరూపంలో జరుగుతోందనే విషయాన్ని మాత్రం ప్రధాని చెప్పలేదు. రెండు రాష్ట్రాల్లో కూడా తెలంగాణాలో 17.6 శాతం, ఏపిలో 11.6 శాతం టీకా వృధా అవుతోందట. తర్వాత ఉత్తరప్రదేశ్ లో 9.4 శాతం వృధా అవుతోందట.

టీకాను అందుబాటులోకి తెచ్చినపుడే జీరో శాతం వృధా టార్గెట్ గా మొదలుపెట్టారట. కానీ కేంద్రం అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మూడు రాష్ట్రాల్లో టీకా వృధా అవుతోందని మోడి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇదే సమయంలో టీకాను వేయటంలో ఏపి 7వ స్ధానంలో ఉందట. రోజుకు సగటును 35997 డోసులు వేస్తున్నారు. రాజస్ధాన్ లో అత్యధిక 1.52 లక్షల డోసులను వేస్తున్నారు. మన రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఎక్కువగా కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి, విశాఖపట్నం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జరుగుతోంది.