అమ్మకానికి హైదరాబాద్ ఎయిపోర్టు.. కేంద్రం కీలక నిర్ణయం

రూ.2.5లక్షల కోట్లు కావాలి. భారీ నిధుల సమీకరణ కోసం ఆస్తుల్ని అమ్మేయటమే పనిగా పెట్టుకున్న మోడీ సర్కారు.. ఇప్పటికే ఎయిరిండియా.. బీఎస్ఎన్ఎల్.. వైజాగ్ స్టీల్ ను విక్రయించేందుకు సిద్ధం కావటం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్టుతో పాటు.. మరిన్ని ఎయిర్ పోర్టుల్ని అమ్మేయాలన్న ఆలోచనకు వచ్చేసినట్లుగా చెబుతున్నారు. తన వాటాలు అధికంగా ఉన్న నాలుగు ఎయిర్ పోర్టులను తాజాగా సేల్ కు పెట్టినట్లుగా తెలుస్తోంది.

కేంద్రానికి చెందిన ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా వాటాలు ఉన్న ఢిల్లీ.. ముంబయి.. బెంగళూరు.. హైదరాబాద్ విమానాశ్రయాల్ని ప్రైవేటీకరించాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో తన వాటాల్ని అమ్మటం ద్వారా రూ.2.5లక్షల కోట్ల నిధుల్ని సమీకరించే ప్రయత్నం చేస్తోంది.

విమానాశ్రయాల విషయానికి వస్తే.. ఇప్పటికే లక్నో.. అహ్మదాబాద్.. జైపూర్.. మంగళూరు.. తిరువనంతపురం.. గువాహటి ఎయిర్ పోర్టుల కాంట్రాక్ట్ లను అదానీ గ్రూపు దక్కించుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 13 ఎయిర్ పోర్టుల ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం గుర్తించింది. తాజాగా అమ్మాలని భావిస్తున్న నాలుగు ఎయిర్ పోర్టుల అమ్మకానికి సంబంధించిన ఫైల్ కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం వెళ్లనుంది.

దేశ వ్యాప్తంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వరంలో వందకుపైగా ఎయిర్ పోర్టులను నిర్వహిస్తున్నారు. ముంబయి ఎయిర్ పోర్టులో అదానీ గ్రూపునకు74 శాతం వాటా ఉంటే.. మిగిలిన 26 శాతం వాటా ఏఏఐ సొంతం. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం విషయానికి వస్తే జీఎంఆర్ గ్రూపునకు 54 శాతం వాటా ఉంటే.. ఏఏఐకి 26 శాతం ఉంది. హైదరాబాద్ ఎయిర్ పోర్టు విషయానికి వస్తే ఏఏఐకు.. రాష్ట్ర ప్రభుత్వానికి 26 శాతం వాటా ఉంది. బెంగళూరు పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. మరి.. ఈ ఎయిర్ పోర్టులను అమ్మాలన్న కేంద్రం నిర్ణయం రాజకీయ రగడకు తెర తీస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.