రెండో పెళ్లి చేసుకుంది.. భర్తను చంపేసి ఇంట్లోనే పూడ్చి పెట్టింది

షాకింగ్ హత్య ఒకటి వెలుగు చూసింది. హైదరాబాద్ శివారులోని వనస్థలిపురంలో చోటు చేసుకున్న ఈ దారుణం గురించి తెలిసిన వారంతా అవాక్కు అవుతున్నారు. ఇలాంటోళ్లు కూడా ఉంటారా? అని ఆశ్చర్యానికి గురవుతున్నారు. కనిపించకుండా పోయాడనుకున్న వ్యక్తి ఇంట్లోనే హత్యకు గురై.. అదే ఇంట్లోనే పాతి పెట్టేశారన్న దారుణ నిజాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. అసలేం జరిగిందంటే..

రెండేళ్ల క్రితం మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసిన గగన్ అగర్వాల్ అనే వ్యక్తి గత జూన్ లో నౌసిన్ బేగంను పెళ్లి చేసుకున్నారు. అంతా బాగానే ఉందని భావిస్తున్న వేళ.. గత నెల (ఫిబ్రవరి 8న) కనిపించకుండా పోయాడు. అతని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు దర్యాప్తు జరుపుతున్నారు. తన సోదరుడు మిస్సింగ్ కేసు గురించి గగన్ సోదరుడు పోలీసుల్ని తరచూ వాకబు చేసేవాడు.

విచారణ జరిపిన పోలీసులకు సందేహం వచ్చి ఇంట్లో తనిఖీ నిర్వహించగా.. భర్తను ఇంట్లో చంపేసి పూడ్చి పెట్టేసిన వైనం వెలుగు చూసింది. కట్టుకున్న భర్తను దారుణంగా చంపేయటం ఒక ఎత్తు కాగా.. ఇంట్లోనే పూడ్చేసి ఏమీ తెలియనిదానిలా ఉన్న ఆమె తీరుకు షాక్ తింటున్నారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు. ఈ హత్య వెనుక అసలు కారణం ఏమై ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.