హైదరాబాద్ ఐపీఎల్‌కు గండికొట్టిన మోడీ

ప్రతి ఏడాదీ వేసవి వచ్చిందంటే క్రికెట్ అభిమానులందరి చూపూ ఐపీఎల్ మీదే ఉంటుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఆ సమయంలో ఎక్కడ చూసినా ఐపీఎల్ సందడే కనిపిస్తుంది. క్రికెట్ అభిమానులు స్టేడియాలకు వెళ్లి మ్యాచ్‌లు చూడాలని ఆశపడతారు. దేశంలో ఐపీఎల్‌తో హోరెత్తిపోయే నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. ఇక్కడ సన్‌రైజర్స్ జట్టుకు తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఐతే గత ఏడాది కరోనా కారణంగా ఇండియాలో ఐపీఎల్ జరగలేదు. చాలా ఆలస్యంగా జరిగిన టోర్నీకి యూఏఈ ఆతిథ్యమిచ్చింది.

ఐతే పెద్దగా గ్యాప్ లేకుండా ఐపీఎల్ కొత్త సీజన్ వచ్చేయడంతో అభిమానులు హుషారుగా ఉన్నారు. ఏప్రిల్ రెండో వారంలో మొదలయ్యే ఐపీఎల్‌ను స్టేడియాలకు వెళ్లి చూడాలని ఆశపడుతున్న హైదరాబాదీలకు బీసీసీఐ షాకివ్వబోతున్నట్లు సమాచారం. ఈసారి హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు ఉండవట.

కరోనా నేపథ్యంలో ఒకప్పట్లా ఎనిమిది అంతకంటే ఎక్కువ వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించకూడదని బీసీసీఐ తీర్మానించినట్లు తెలుస్తోంది. వేదికల్ని ఆరుకు పరిమితం చేయనున్నారట. ప్రస్తుతానికి ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్‌లను ఖరారు చేశారు. మహరాష్ట్రాలో కరోనా రెండో వేవ్ నేపథ్యంలో ముంబయిని ఎంపిక చేసే విషయంలో కొంత తర్జన భర్జనలు నడుస్తున్నాయి. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఓకే అంటే అక్కడా ఐపీఎల్ జరుగుతుంది. ఎప్పుడూ ఐపీఎల్‌కు ఆతిథ్యమిచ్చే హైదరాబాద్, జైపూర్, మొహాలిలను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

దక్షిణాదిన బెంగళూరు, చెన్నైలకు అవకాశం కల్పించి హైదరాబాద్‌ను మాత్రం విస్మరించడం అన్యాయమే. ఐతే హైదరాబాదీ ఆటగాళ్లను సన్‌రైజర్స్ జట్టు ఎంచుకోకపోవడంపై ఆగ్రహిస్తూ ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. ఐపీఎల్ మ్యాచ్‌లను అడ్డుకుంటామన్న హెచ్చరికలు ప్రతికూల ప్రభావం చూపాయేమో తెలియదు. అంతకు మించి ప్రధాని నరేంద్ర మోడీ సొంత నగరం అహ్మదాబాద్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా అవతరించిన మొతేరాకు మ్యాచ్‌లు కేటాయించడం కోసం హైదరాబాద్‌ను తప్పించి ఉండొచ్చని కూడా భావిస్తున్నారు. అహ్మదాబాద్ కేంద్రంగా ఐపీఎల్ ఫ్రాంచైజీ లేకపోయినా.. ఇక్కడ ఫ్రాంఛైజీ ఉన్న హైదరాబాద్‌కు అన్యాయం చేయడమేంటో?