స్వతంత్ర భారతంలో తొలిసారి ఉరిశిక్ష ఆ మహిళకే

దేశంలో ఉరిశిక్షలు కొత్తేం కాదు. కానీ.. స్వతంత్ర భారతంలో ఒక మహిళకు ఉరిశిక్షను అమలు చేసే చెత్త రికార్డును ఒక మహిళ తన పేరిట రాయించుకోనున్నారా? అంత దారుణమైన నేరం ఆమేం చేసింది? లాంటి ప్రశ్నలకు సమాధానంగా షబ్నమ్ ను చెప్పాలి. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆమె.. దేశంలో ఉరిశిక్ష అమలు కానున్న మహిళగా రికార్డుల్లోకి ఎక్కనున్నారు. అమ్రోహా ప్రాంతానికి చెందిన ఆమె.. ప్రియుడు కోసం తన కుటుంబానికి చెందిన ఏడుగురిని చంపేసిన కర్కశకురాలిగా చెప్పాలి. ప్రియుడితో కలిసి చేసిన ఈ పనికి ఆమెకు వేసిన ఉరిశిక్షను త్వరలో అమలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇంతకూ తన కుటుంబ సభ్యుల్ని తానే ఎందుకు చంపుకుంది? అన్న వివరాల్లోకి వెళితే.. ఐదో తరగతి ఫెయిల్ అయిన సలీంను షబ్నమ్ ప్రేమించింది. అతడ్ని పెళ్లి చేసుకునేందుకు ఆమె కుటుంబ సభ్యులు నో చెప్పారు. అంతే.. వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన షబ్నమ్.. తల్లి.. తండ్రి.. సోదరులు.. సోదరిని ప్రియుడితో కలిసి గొడ్డలితో నరికి చంపేసింది. ఈ కేసులో సలీం.. షబ్నమ్ లకు స్థానిక కోర్టు ఉరిశిక్షను విధించాయి.

దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కూడా కింది కోర్టుల తీర్పును సమర్థించింది. దీంతో.. వీరిని ఉరి తీయటానికి ముందు ఆఖరి ప్రయత్నంగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నారు. అది కూడా రిజెక్టు కావటంతో ఈ ఇద్దరిని ఊరి తీయాలని నిర్ణయించారు. ప్రస్తుతం యరవాడ జైల్లో ఉన్న వీరిని ఉరి తీయనున్నారు. నిర్భయ హంతకులకు ఉరి తీసిన పవన్ జల్లాదే షబ్నమ్ ను ఉరి తీయనున్నారు.

వాస్తవానికి షబ్నమ్ కు ముందు.. మహారాష్ట్రకు చెందిన సీమా.. గవిట్.. రేణు షిండే అనే మహిళలకు ఉరి పడింది. ఐదుగురు చిన్నారుల్ని హత్య చేసిన కేసులో వీరు దోషులుగా తేలారు. వీరికి విధించిన ఉరిని రద్దు చేయటానికి 2014లో రాష్ట్రపతి రిజెక్టు చేశారు. అయినప్పటికి వీరికి ఉరి ఇంకా అమలు కాలేదు. ఇదిలా ఉండగా షబ్నమ్ ను ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆమెను ఉరి తీసే డేట్ ఇంకా నిర్ణయించనప్పటికీ.. ఆమెకు శిక్ష అమలు చేసే ప్రాంతాన్ని ఉరి తీసే తలారి పవన్ రెండుసార్లు పరిశీలించారు. త్వరలోనే ఆమెకు ఉరిశిక్ష అమలు చేయనున్నట్లుగా చెబుతున్నారు. అదే జరిగితే.. స్వతంత్ర భారతంలో ఉరిశిక్ష అమలైన తొలి మహిళగా షబ్నమ్ నిలిచిపోతారు. అదే సమయంలో ఆమె చేసిన కిరాతక హత్యలు నిలిచిపోనున్నాయి.