అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్ అమెరికన్ టెక్ ఎంటర్ప్రెన్యూర్ వివేక్ వాధ్వా ఇప్పుడు ఇదే చెప్పారు. అమెరికాలో గ్రీన్కార్డ్ బ్యాక్లాగ్లో ఉన్న భారతీయుల్లో కేవలం 10 శాతం మంది తిరిగొచ్చినా, రెండు నుంచి మూడేళ్లలో భారత జీడీపీకి ఒక శాతం వరకు అదనంగా చేరొచ్చని అంచనా వేశారు.
అమెరికాలో ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన వెంటనే గ్రీన్కార్డ్ రాదు. ముఖ్యంగా ఉద్యోగాల ఆధారంగా ఇచ్చే గ్రీన్కార్డుల విషయంలో భారతీయులకు భారీ వెయిటింగ్ ఉంది. దీంతో చాలామంది H-1B వంటి వీసాలపై ఏళ్ల తరబడి అక్కడే కొనసాగుతున్నారు. ఉద్యోగం మారాలన్నా, సొంతంగా కంపెనీ ప్రారంభించాలన్నా వారి వీసా పరిస్థితి కూడా కీలకంగా మారుతుంది.
వాధ్వా ఈ లెక్క చెప్పడానికి మరో కారణం ఉంది. గ్రీన్కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వారిలో ఇంజినీర్లు, టెక్ నిపుణులు, మేనేజర్లు, ఎంటర్ప్రెన్యూర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరిలో కొంతమంది భారత్కు తిరిగొచ్చి కంపెనీలు ప్రారంభించడం, కొత్త ఉద్యోగాలు సృష్టించడం, అమెరికాలో సంపాదించిన అనుభవాన్ని ఇక్కడ ఉపయోగించడం వల్ల ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
మరోవైపు అమెరికాలో H-1B వీసాల విషయంలో పరిస్థితులు మారుతున్నాయి. 2025లో తీసుకొచ్చిన లక్ష డాలర్ల ఫీజు తర్వాత అమెరికా బయట నుంచి దాఖలయ్యే కొత్త H-1B పిటిషన్లు 91 శాతానికి పైగా తగ్గినట్లు యూఎస్సీఐఎస్ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా విదేశాల నుంచి ఉద్యోగులను అమెరికాకు తీసుకెళ్లే కంపెనీలపై ఈ మార్పు ప్రభావం పడుతోంది.
అయితే భారతీయుల్లో 10 శాతం మంది నిజంగానే తిరిగొస్తారని వాధ్వా చెప్పడం లేదు. అంతమంది వస్తే భారత్కు ఎంత ప్రయోజనం ఉండొచ్చన్నదే ఆయన అంచనా. పైగా అమెరికాలో ఇళ్లు కొనుక్కొని, పిల్లల చదువులు, కుటుంబాలతో స్థిరపడినవారు ఒక్కసారిగా భారత్కు రావడం సులభం కాదు. ఇక్కడ వారికి సరైన ఉద్యోగాలు, జీతాలు దొరకడం కూడా ముఖ్యమే. ఇక సొంత కంపెనీలు పెట్టాలనుకునేవారికి అవసరమైన అవకాశాలు కూడా లభించాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates