దేశవ్యాప్తంగా 288 మంది నేపాల్ వరదల్లో గల్లంతయ్యారని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 532 మంది ఆచూకీ కనిపించకుండా పోయారని.. అయితే.. వీరిలో 288 మంది మినహా మిగిలిన వారి ఆచూకీ తెలిసిందని.. వారిని నేపాల్ సహాయక బృందాలు కాపాడాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ప్రకటించారు. అయితే.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మిగిలిన వారి ఆచూకీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ఇక, ఏపీ విషయానికి వస్తే.. ప్రభుత్వ సలహాదారు, డీఆర్ డీవో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి సహా.. మానస సరోవరం యాత్రకు వెళ్లిన బృందం క్షేమంగానే ఉందని వీడియోలు విడుదల చేసింది. అదేవిధంగా ఓ మీడియా సంస్థతోనూ సతీష్ రెడ్డి మాట్లాడారు. తాము క్షేమంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఇక, ఏపీ నుంచి వెళ్లిన పర్యాటకుల్లో ఐదుగురి ఆచూకీ తెలియాల్సి ఉందని ప్రభుత్వం పేర్కొంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ విషయాన్ని తెలిపారు.
తమిళనాడు నుంచి వెళ్లిన వారిలో 21 మందిని సురక్షితంగా కాపాడినట్టు.. భారత విదేశాంగ శాఖ తెలిపిం ది. మిగిలిన వారి కోసం గాలింపు ముమ్మరం చేసినట్టు చెప్పారు. చైనా వైపు టిబెట్లో చిక్కుకుపోయిన వారి వివరాలను ఆరా తీస్తున్నట్టు వెల్లడించారు. నేపాల్లోని త్రిశూలి-1 విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది ఆచూకీ కూడా తెలియరాలేదని తెలిపారు. పశ్చిమ బెంగాల్ నుంచి 32 మంది, కేరళ నుంచి 33 మంది కూడా గల్లంతయ్యారని పేర్కొన్నారు.
ఆచూకీ లభ్యమయ్యేనా?
నేపాల్ వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. అయితే .. వారి ఆచూకీ లభ్యమవుతుందా? అనేది ప్రశ్నగా మారింది. రహదారులు, ఇళ్లు కూడా కొట్టుకుపోయిన నేపథ్యంలో నేపాల్ లో వరద ప్రభావిత జిల్లాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో ఆచూకీ లభ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, ఈ వరదల్లో కొట్టుకుపోయిన సామగ్రి.. బీహార్, యూపీలలోని నదుల్లోకి కొట్టుకురావడం.. వరద ప్రభావానికి అద్దం పడుతోందని అధికారులు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates