టిబెట్లో భూకంపం వల్లే నేపాల్లో వరదలు?

నేపాల్ లో ఒక్కసారిగా విరుచుకొని పడిన వరద దృశ్యాలు యావత్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కళ్ళ ముందే మనుషులు కొట్టుకొని పోవడం ఒళ్ళు గగుర్పాటు కలగజేస్తుంది. ఈ వరదల విషయం కూడా కొన్ని మీడియా సంస్థలు యధావిధిగా చైనా కుట్రగా ప్రచారం చేశాయి. కానీ టిబెట్లో సంభవించిన భూకంపం తమ దేశంలో వరదలకు కారణంగా భావిస్తున్నట్లు నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ ప్రకటించారు.

టిబెట్లో బుధవారం ఉదయం 8.37 గంటల సమయంలో భూ కంపం సంభవించిందని, రిక్టర్ స్కేలుపై. 4.4 తీవ్రతతో భూ కంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు.

అదే సమయంలో టిబెట్లోని రాసువా జిల్లాకు అనుకొని వున్న గ్యిరోంగ్ పోర్టు ప్రాంతంలో వరద విరుచుకొని పడింది. నేపాల్ విపత్తు నిర్వాహణ సంస్థ శాటిలైట్ ఇమేజీలో ఈ దృశ్యాలు చూసినట్లు పేర్కొనడం గమనార్హం. దీంతోపాటు లేండే నదికి అడ్డంగా పేరుకొని పోయిన మంచు చరియల మీద కొండచరియలు పడటంతో ఒక్కసారిగా అడ్డుతొలిగింది. ఎగువ ప్రాంతంలో వున్న లేండే నదిలోని నీరు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలపై విరుచుకొని పడింది. ఆ నీటి ప్రవాహం మొత్తం భోటే కోశీ నదిలోకి వచ్చి పడటంతో వరద కట్టలు తెంచుకుందని విపత్తు నిర్వహణ అధికారులు వివరించారు.

నేపాల్లో వరద సంభవించగానే కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. లేండే నది నేపాల్లో భోటే కోశీ నదిలోకి కలిసి, త్రిషూలీ నదిగా, కాశీ గండకీలుగా ప్రవహించి నారాయణి నదిగా బీహార్లోకి ప్రవహిస్తుంది. బీహార్ ప్రజలు ఈ నదిని గండక్ నదిగా పిలుచుకుంటారు. బీహార్, ఉత్తరప్రదేశ్ సరిహద్దులగుండా ప్రవహిస్తుంది. చివరికి గంగా నదిలో కలిసిపోతుంది. కనుక ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం హెచ్చరించింది. గండక్ నది పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించింది.

నేపాల్లో ఆకస్మికంగా సంభవించిన వరదల్లో తాజా వార్తల ప్రకారం 105 మంది భారతీయులు గల్లంతయినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. నేపాల్లోని రాయబార కార్యాలయాన్ని అలర్ట్ చేసింది. ఒకవైపున ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా నేపాల్ కు సహాయం అందిస్తూనే మరోవైపు భారతీయుల రక్షణకు అవసరమైన చర్యలను వేగవంతం చేసింది. నేపాల్లోని రాయబార కార్యాలయంలో ప్రత్యేక ఎమర్జన్సీ నెంబర్లను ప్రకటించింది. +977 985 131 6807, + 977 970 910 7500 నెంబర్లకు వాట్సాప్ ద్వారా సంప్రదించాలని సూచించింది.