అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి హడావుడి చేస్తున్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి రెండున్నారేళ్లవుతున్న నేపథ్యంలో కూటమి పరిస్థితి, ప్రతిపక్ష వైసీపీకి ప్రజల్లో గ్రాఫ్ పెరిగిందంటూ సర్వేలో తేలిందని జోరిగలా ప్రచారం చేస్తున్నారు. సీఎం గా జగన్ ను 44 శాతం, చంద్రబాబును 32 శాతం సమర్దించినట్లు సర్వేలో ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు ఒక ప్రచారం చేస్తున్నారు.

2029 ఎన్నికల్లో కూటమి సర్కార్ మళ్ళీ అధికారంలోకి రాదని 44 శాతం బలంగా నమ్ముతున్నట్లు, ఎన్నికల్లో ముక్కోణంలో పోటీ జరిగితే వైసీపీకి 49 శాతం, కూటమి కలిసి పోటీ చేసినా 45.5 శాతం ఓట్లు పడతాయని నమ్మించే ప్రయత్నం చేసింది. మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని కొంతమంది అమాయకులు నమ్మే పరిస్థితి వుంది.

నిజానికి హైదరాబాద్ ఐఐటీయన్లు ఎవరూ ఇలాంటి ఒక సర్వే చేసినట్లు అధికారిక ఆధారాలు లేవు. ఇటీవల కాలంలో ఐఐటీయన్లు కానీ, ఇతరా జాతీయ సంస్థలు కానీ ఎలాంటి సర్వే నిర్వహించినట్లు దాఖలాలు లేవని అధికారులు చెబుతున్నారు. నిజంగా ఇలాంటి సర్వే నిర్వహించడానికి అనేక వ్యయ ప్రయాసాలు ఉంటాయాని నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాద్ ఐఐటీయన్లు ఎవరు అనేది స్పష్టంగా పేర్కొనక పోవడం గమనార్హం. జూన్ 18 నుంచి 20 వరకు రెండు రోజుల పాటు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సర్వే చేయడం ఎంత మాత్రం కుదరని పని. పైగా ఇంత తక్కువ సమయంలో 2లక్షల మందితో సర్వే చేయడం అనే దానికి ఎలాంటి శాస్త్రీయత ఉండదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాట్సాప్ ఫార్వార్డులు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా సృష్టించే ఇలాంటి సర్వేల వెనక పెయిడ్ బ్యాచ్ ఉంటారని, ఎవరు డబ్బులు ముట్టచెబితే వారికి అనుకూలంగా ఒక సర్వే కథను వండి వారిస్తుంటారని హైదరాబాద్ ఐటీ సెక్టార్ లో చెప్పుకొంటున్నారు.

నిజానికి పక్కాగా ఒక సర్వే చేయాలంటే 45 రోజుల నుంచి 60 రోజులు పడుతుందని, సర్వే చేసేందుకు సుశిక్షితులైన 500 మంది సిబ్బంది అవసరం అవుతుందని డేటా అనలిస్టులు చెబుతున్నారు. ప్రశ్నా పత్రాలు రెడీ చేయడం, ఫీల్డ్ లోకి వెళ్లి డేటా సేకరించడం, డేటా క్లియరింగ్, గణాంక విశ్లేషణ, తుది నివేదిక తయారు చేయడం వంటి పెద్ద తతంగం ఉంటుందని, దీనికి ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఒక్కొక్క శాంపిల్ సేకరించడానికే 200 రూపాయల వరకు ఖర్చు అవుతుందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పుడు హైదరాబాద్ ఐఐటీయన్లు చేసినట్లు చెబుతున్న సర్వేలో ఈ ప్రాసెస్ అంతా జరిగిందా అంటే లేదనే చెప్పాలి. జూన్ 18 నుంచి 20 వరకు రెండు లక్షల మంది ఓటర్లతో సర్వే నిర్వహించడం ఒక మాయ. ఊరు పేరు లేని ఒక గుంపు చేసినట్లు చెబుతున్న సర్వేని పట్టుకొని వైసీపీ నాయకులు, శ్రేణులు, ఐటీ సెల్ కార్యకర్తలు సంబరపడి పోవడం వెనక ఆ పార్టీ వ్యూహకర్తలు వున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

సరిగ్గా స్థానిక ఎన్నికల సమయంలో ఈ సర్వే వెలువడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ ఈ రెండున్నరేళ్లలో ఇంకా కోలుకోలేదన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు కనుక స్థానిక ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థానాల్లో గెలవడం చాలా అవసరం. లేకపోతే పార్టీ కేడర్ చిన్నగా జారుకుంటారు. అంతే కాకుండా లోకల్ ఎన్నికల్లో కూటమి బలంగా కనిపిస్తుంది. దాంతో అనేక జిల్లాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు ముందుకు రావట్లేదు. కనుక వారికి గెలుస్తాం అన్న నమ్మకం కలిగించాలి. ఈ క్రమంలోనే వైసీపీ వ్యూహకర్తలు హైదరాబాద్ ఐఐటీయన్ల సర్వే డ్రామాకు తెరదీసినట్లు పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం జరుగుతుంది.