స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఆదేశాల మేర‌కు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు త‌మ త‌మ నియోజ‌క వ‌ర్గాల ప‌రిధిలో స్థానిక నేత‌ల బ‌లాబ‌లాల‌ను అంచ‌నా వేసే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. అక్టోబ‌రులో గా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. కేంద్ర 16వ ఆర్థిక సంఘం ఇచ్చే నిధు ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకునేందుకు స్థానిక ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం అత్యంత అవ‌స‌రం.

ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల‌కు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని 100 మునిసిపాలిటీ ల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. కూట‌మి పార్టీల మ‌ధ్యే ఈ ఎన్నిక‌లు ప్ర‌ధానంగా చ‌ర్చ‌నీ యాంశం అయ్యాయి. మ‌రీ ముఖ్యంగా జ‌న‌సేన క్షేత్ర‌స్థాయి నాయకులు ఈ ఎన్నిక‌ల్లో పోటీకిరెడీ అవుతున్నారు. ఈ వ్య‌వ‌హారం అధిష్టానంపైనా ఒత్తిడి పెంచింది. దీంతో ఎవ‌రినీ నొప్పించ‌కుండా.. మ‌ధ్యేమార్గంగా.. బ‌లం తేల్చాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్ణ‌యించారు. క్షేత్ర‌స్థాయిలో బ‌లంగా ఉండి.. గెలుస్తార‌ని ప‌క్కా న‌మ్మిన వారికి ఖ‌చ్చితంగా పోటీకి అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

ఇదే విష‌యాన్ని తాజాగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు చెప్పారు. ఈ విష‌యంలో పూర్తిస్థాయి నివేదిక‌ను రెడీ చేయాల‌ని పేర్కొన్నారు. మొత్తం 15 రోజుల్లో ఈ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌న్నారు. మూడు అంశాల‌ను ప్ర‌ధాన ప్రాతిప‌దిక‌గా నిర్దేశించారు. దాని ప్ర‌కారం.. అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయాల‌న్నారు. 1) వార్డులు, పంచాయ‌తీల్లో.. ఖ‌చ్చితంగా గెలుస్తార‌ని భావించిన నాయ‌కుల నుంచి ఇద్ద‌రేసి చొప్పున సిఫార‌సు చేయాలి. వీరిలో అధిష్టానం ఒక‌రిని ఎంపిక చేస్తుంది.

2) గ‌త స్థానిక ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న వారిని కొన‌సాగించ‌డంలో స్థానిక ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేయాలి. కార్య‌క‌ర్త‌ల మ‌నోభావాల‌ను తెలుసుకోవాలి.

3) వైసీపీపై పోరాడి ఓడిన వారిని కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని వారి గ్రాఫ్ ఆధారంగా నిర్ణ‌యం తీసుకోవాలి. వ‌చ్చే స్థానిక ఎన్నిక‌ల్లోనూ కూట‌మికి ఇబ్బందులు రాకుండా చూసుకునేలా యంత్రాంగం ప‌నిచేయాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ సూచించారు. ఇక‌, కూట‌మి విష‌యంలో ఎవ‌రూ స్పందించ‌రాద‌ని. పొత్తుల విష‌యం తానే చూసుకుంటాన‌ని ప‌వ‌న్ హామీ ఇవ్వ‌డంతో జ‌న‌సేన‌లో నాయ‌కులు ఉత్సాహంగా అడుగులు వేస్తున్నారు.