పిఠాపురంలో ఎవ్వ‌రికి ఛాన్స్ లేద‌బ్బా.. !

సామాజికంగా.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ప‌రంగా.. నాయ‌కులు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో పాగా వేసేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కొక్క‌ తర‌హా రాజ‌కీయాలు సాగుతాయి. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రిలోని పిఠాపురంలో ఎలా చూసుకున్నా.. ఇత‌ర పార్టీల నాయ‌కుల‌కు ఛాన్స్ క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుత డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ విజ‌యం ప‌క్కాగా రాసిపెట్టుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు.

మూడు కార‌ణాలు..

ఎన్నిక‌ల‌కు రెండున్న‌రేళ్ల ముందే.. ఒక నియోజ‌క‌వ‌ర్గంలో నాయ‌కుడి గెలుపును నిర్ణ‌యించేయ‌డం అంటే ఆషామాషీ కాదు. పోనీ.. త‌ర‌త‌రాలుగా.. వార‌స‌త్వంగా వ‌చ్చిన నియోజ‌క‌వ‌ర్గం అయితే..(ఉదాహ‌ర‌ణ పులివెందుల‌) అంచ‌నాలు ఉంటాయి. కానీ, ఏమాత్రం సంబంధం లేని, తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న నియోజ‌క‌వ‌ర్గంలో రెండున్న‌రేళ్ల ముందే ప‌వ‌న్‌కు ఈ త‌ర‌హా ఫీడ్ బ్యాక్ రావ‌డం విశేష‌మ‌నే చెప్పాలి. తాజాగా పంచాయ‌తీరాజ్ శాఖ నుంచి తీసుకున్న ఫీడ్ బ్యాక్‌, పార్టీ నుంచి తీసుకున్న ఫీడ్ బ్యాక్ కూడా ప‌వ‌న్‌కు తిరుగులేద‌న్న సంకేతాలు పంపుతున్నాయి.

1) అభివృద్ది: పిఠాపురంలో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో అభివృద్ధి ముందుకు సాగుతోంది. గ‌త ఎన్నిక‌ల స‌మయంలో ఇచ్చిన ప్ర‌తిహామీని ప‌వ‌న్ క‌ల్యాణ్ నిల‌బెట్టుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతంలో ర‌హ‌దారులు పూర్త‌య్యాయి. ఇప్పుడు పిఠాపురం- నుంచి ఇత‌ర ప్రాంతాల‌ను క‌లిపే.. ప్ర‌ధాన ర‌హ‌దారుల‌పై దృష్టి పెట్టారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో ప‌క్కాగా అభివృద్ది ముందుకు సాగుతోంది. అదే స‌మ‌యంలో కొత్త ప‌నులు కూడా చేప‌ట్టారు. ఒక‌వైపు రైతుల‌కు, మ‌రోవైపు పారిశ్రామిక వేత్త‌ల‌కు కూడా అండ‌గా ఉంటున్నారు.

2) సామాజిక వ‌ర్గం: సామాజిక వ‌ర్గం ప‌రంగా.. దాదాపు కాపులు అంద‌రూ ప‌వ‌న్ వైపే నిల‌బ‌డ్డారు. ఇత‌ర పార్టీల్లోని కాపు నాయ‌కుల ప్ర‌భావం పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. ఉన్న‌వారంతా ప‌వ‌న్‌కు జైకొట్ట‌డం గ‌మ‌నార్హం. ఇది కూడా వ‌చ్చే ఎన్నిక‌ల‌పై అంచ‌నాలు పెంచింది.

3) మ‌హిళ‌లు: పిఠాపురంలో మ‌హిళా ఓటు బ్యాంకు ఎక్కువ‌. ఇప్పుడు ఈ ఓటు బ్యాంకు ప‌వ‌న్‌కు అనుకూలంగా మారిపోయింది. అంతేకాదు.. మ‌రోసారి ప‌వ‌న్‌ను అధిక మెజారిటీతో గెలిపించుకుంటామ‌ని మ‌హిళ‌లు చెబుతున్నారు. సో.. ఇలా ప‌వ‌న్ నియోక‌వ‌ర్గంలో ఎలా చూసుకున్నా.. వేరేవారికి.. వేరే పార్టీకి కూడా అవ‌కాశం క‌నిపించ‌డం లేదు.