ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు దేశంలో దుమారం రేపుతోంది. ఒక ప్రాఫెసర్, ఐదుగురు విద్యార్థులతో కలిసి పేపర్ లీక్ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. జాతీయ, అంతర్జాతీయ మీడియాలో ఈ వార్త పతాక శీర్షికలకు ఎక్కింది. పాఠాలు చెప్పడంలో తెలితేటలు ప్రదర్శించాల్సిన ప్రొఫెసర్ పేపర్ లీక్ చేయడంలో స్కిల్స్ ప్రదర్శించడం మేధావులను విస్మయానికి గురి చేస్తుంది. అసలేం జరిగిందంటే…

రాయ్ పూర్ లోని ఐజీవీకే యూనివర్సిటీలో ఈనెల 20 వ తేదీన బీఎస్సీ అగ్రికల్చర్ ద్వితీయ సంవత్సరం ఎంటోమాలాజీ పరీక్షలు జరగాల్సి వుంది. దానికంటే ముందే పరీక్షా పత్రాలు లీకయ్యాయి. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో యూనివర్సిటీ అధికారులు ఉలిక్కి పడ్డారు. ఆగస్టు 20న జరగాల్సిన పరీక్షలను రద్దు చేసింది. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారు రంగంలోకి దిగడం వెనువెంటనే జరిగిపోయాయి. పేపర్ లీకేజికి కారణమైన ప్రొఫెసర్ యోగేష్ సొంకేరియా, విద్యార్థులు అజయ్ నాయక్, త్రిదేవ్ పటేల్, నితిన్ పాండే, అనుజ్ మింజ్, ఆదిత్య సాహులను అరెస్టు చేసింది. పోలీసుల విచారణలో వెలుగు చూసిన విషయాలు దేశాన్ని విస్మయం కలిగించాయి.

దుర్గ్ జిల్లాలోని భారతీ అగ్రికల్చర్ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న యోగేష్ యూనివర్శిటి నుంచి ప్రశ్నా పత్రాలను తీసుకొని రావడం, జవాబు పత్రాలను అప్పగించే బాధ్యతలు చూస్తుండేవాడు. ఆగస్టు 17 వ తేదీన వర్శిటీ నుంచి ఎంట మాలాజీ ప్రశ్నా పత్రాలను సేకరించి ఇంటికి తీసుకెళ్లాడు. ముందస్తు వేసుకున్న ప్లాన్ ప్రకారం ప్రశ్నా పత్రాలు వున్న సీల్డ్ కవర్ చించకుండా సూదితో చిన్న రంద్రం వేశాడు. అందులోంచి ఎండోస్కోపిక్ కెమెరాను పంపించి ప్రశ్నలను స్కాన్ చేశాడు. ఇప్పటి వరకు జీర్ణ సమస్యలతో బాధ పడే వారి కడుపులోకి ఎండోస్కోపిక్ కెమెరా పంపించి నిపుణులైన వైద్యులు రోగి యొక్క వ్యాధిని నిర్దారించడం జరిగేది. ఇప్పుడు ఆ వైద్య పరికరాన్ని ఉపయోగించి పరీక్షా పేపర్ లీక్ చేయడం సంచలనం సృష్టిస్తుంది.

లీక్ చేసిన పరీక్షా పేపర్లను ఒక్కొక్కరికి 12 వేల రూపాయలకు విక్రయించినట్లు పోలీసు విచారణలో అంగీకరించాడు. అజయ్ నాయక్, అతడి మిత్ర బృందం ద్వారా పేపర్లను అమ్మకానికి పెట్టాడు. పేపర్ కొన్న కొందరు విద్యార్థులు దీన్ని వాట్సాప్ లో పెట్టడంతో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. పరీక్షలు జరగడానికి 2 గంటల ముందు దీన్ని వర్శిటి అధికారులు గమనించారు. వెంటనే తగిన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు కాలేజీలో పాఠాలు చెప్పాల్సిన ప్రొఫెసర్ విద్యార్థులతో కలిసి జైలు ఊచలు లెక్క బెడుతున్నాడు. బీజేపీ పాలిత రాష్ట్రమైన చత్తిస్ ఘడ్ లో జరిగిన ఈ ఘటనతో కేంద్రం అప్రమత్తం అయింది.