కొన్నేళ్లుగా భారత్ లో బ్యాన్ ఎదుర్కొంటున్న టిక్ టాక్ గుర్తింది కదా? ఇప్పుడు ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించారు. ఇప్పటివరకు ఆ స్థానాన్ని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఉండేవారు. ఆయన స్థానాన్ని వెనక్కి నెట్టి..రేసులో ముందుకు వచ్చేశారు చైనా వ్యాపార దిగ్గజం బైట్ డ్యాన్స్ సంస్థ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్.
బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం 43 ఏళ్ల జాంగ్ సంపద మన రూపాయిల్లో రూ.10 లక్షల కోట్లను దాటేసినట్లుగా లెక్కలు కట్టింది. ఆయన తర్వాతిస్థానంలో గౌతమ్ అదానీ నిలిచారు. మూడోస్థానంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ నిలిచారు. సంప్రదాయ వ్యాపారానికి బదులుగా టెక్నాలజీ ఆధారిత సేవలు అందించే సంస్థను స్థాపించిన వ్యక్తి ఈ రోజున ఆసియాలో అత్యంత సంపన్నుడిగా అవతరించిన పరిస్థితి. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. కేవలం ఆరేడేళ్ల వ్యవధిలో జాంగ్ ఈ స్థాయికి చేరుకున్నారు.
2019 మార్చిలో 1300 కోట్ల డాలర్లుగా ఉన్న జాంగ్ సంపద కొద్ది సంవత్సరాల్లోనే ఎనిమిది రెట్లకు పైగా పెరిగింది. సెప్టెంబరులో జాంగ్ సంపద 1200 కోట్ల డాలర్లకు పైనే పెరగటం మరో విశేషంగా చెప్పాలి. సంప్రదాయ కంపెనీలతో పోలిసతే.. ఏఐ కంపెనీల ప్రభావం ఎంత భారీగా ఉందో.. సంపదను పోగేసే విషయంలో ఎంత దూకుడు ప్రదర్శించవచ్చన్న విషయాన్ని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి.
టిక్ టాక్ సక్సెస్ తర్వాత..దానిమీద వచ్చే సంపదను ఏఐ మీదకు మళ్లించిన జాంగ్ అక్కడ కూడా విజయాన్ని సాధించాడు. డౌబావో.. చాట్ బాట్.. సీడ్యాన్స్ వీడియో జనరేషన్ టూల్ లాంటి ఉత్పత్తులతో బైట్ డ్యాన్స్ వేగంగా విస్తరించింది. ఇప్పటికే చైనాలో అత్యంత సంపన్నుడిగా ఉన్న ఆయన.. తాజాగా ఆసియా అపరకుబేరుడి స్థానానికి చేరుకున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates