జాక్ మా అదృశ్యం..ఏమైపోయాడో ?

ప్రపంచ కుబేరుల్లో ఒకరు, చైనాలోనే అత్యంత ధనవంతుల్లో రెండో వ్యాపారవేత్త, ఆలీబాబా కంపెనీల వ్యవస్ధాపకుడు జాక్ మా అదృశ్యమైపోయారు. గడచిన మూడు నెలలుగా ఎక్కడా కనబడటం లేదు. రోజువారి జాక్ హాజరయ్యే ఆఫీసుకు కూడా రావటం లేదు. అసలు ఎవరికీ కనబడకుండాపోవటంతో అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ జాక్ మా ఎందుకు మాయమైపోయారు ? దీనివెనుక కారణం ఏమైఉంటుంది ?

చైనాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ఏమైనా మాట్లాడితే తర్వాత వాళ్ళు అడ్రస్ కనబడరు. గతంలో ఇటువంటి ఘటనలు చాలానే జరిగాయి. కరోనా వైరస్ బాగా ఉదృతంగా ఉన్న కాలంలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, వైరస్ వ్యాప్తికి చైనాయే కారణమని విమర్శించిన, ఆరోపణలు చేసిన వాళ్ళలో చాలామంది ఇప్పటికీ కనబడలేదట. వాళ్ళంతా ఏమైపోయారు ఎవరికీ కనీసం ఇంట్లో వాళ్ళకు కూడా ఇప్పటివరకు తెలీలేదు.

ఇక జాక్ మా విషయానికి వస్తే మొన్నటి అక్బోటర్ లో చైనా ప్రభుత్వ విధానాలపై దుమ్మెత్తిపోశారు. బ్యాంకింగ్ విధానాలను తూర్పారబట్టారు. బ్యాంకింగ్ విధానాల్లో సంస్కరణలను తేవటం లేదని, బ్యాంకులను తాకట్టు దుకాణాల్లో వాడుకుంటోందంటు జాక్ ప్రభుత్వాన్ని చాలా తీవ్రంగా దుయ్యబట్టారు. ఎప్పుడైతే జాక్ బ్యాంకులపై తీవ్రస్దాయిలో విమర్శలు చేశారో అప్పటి నుండి ఆయన వ్యాపారాలపై ప్రభావం మొదలైంది.

జాక్ మా పరిశ్రమలకు చెందిన షేర్లు పడిపోతున్నాయి. ఆయన్ను ప్రభుత్వానికి చెప్పకుండా దేశం వదిలి బయటకు వెళ్ళవద్దని హెచ్చరించింది. ఆయన సంస్ధలపై హఠాత్తుగా విచారణలు మొదలయ్యాయి. కొన్ని ఆఫీసులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను కూడా ప్రభుత్వం ఫ్రీజ్ చేసేసింది. ఇవన్నీ ఒక ఎత్తైతే అసలు మూడు నెలలుగా ఎవరికీ కనబడకుండా పోవటమే అందరినీ టెన్షన్ కు గురిచేస్తోంది. ఆంక్షలకు ముందే జాక్ విదేశాలకు వెళ్ళిపోయి హైడవుట్ లో ఉంటున్నారా ? లేకపోతే ఇంకేమైనా జరిగిందా ? అన్నదే అర్ధం కావటం లేదు.