కరోనా మహమ్మారి పుణ్యమా అని వర్క్ ఫ్రమ్ హోమ్ మన జీవనయానంలో ఓ విదానం అయితే… ఆ తీరు ప్రభావం మరింత ఎక్కువైన ఓ వ్యక్తి అప్పుడెప్పుడో వర్క్ ఇన్ కార్ ను పరిచయం చేశాడు. దానినీ గిరాటేసిన మరొకతను ఏకంగా వర్క్ ఆన్ బైక్ అన్న కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టాడు.
వర్క్ ఫ్రం హోమ్ వరకు ఓకే గానీ… మిగిలిన రెండు మన ప్రాణాలతో పాటు ఎదుటి వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసేవే కదా. అందుకే కాబోలు వర్క్ ఇన్ కార్ సమయంలో ఎలాగైతే ప్రజలను అప్రమత్తం చేశారో… ఇప్పుడు వర్క్ ఆన్ బైక్ పైనా అదే రీతిలో ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జన్నారు. సజ్జన్నార్ శనివారం పోస్ట్ చేసిన వర్క్ ఆన్ బైక్ వీడియో వైరల్ అవుతోంది.
సజ్జన్నార్ పోస్ట్ చేసిన వీడియోలో ఏముందన్న విషయానికి వస్తే.. బైకుపై జాగ్రత్తగానే వెళుతున్న ఓ యువకుడు బైక్ హ్యాండిల్స్ మధ్యలో పెట్రోల్ ట్యాంక్ కు కాస్త ముందుగా ల్యాప్ టాప్ ను ఏర్పాటు చేసున్నాడు. అక్కడ ఆన్ లో ఉన్న ల్యాప్ టాప్ పై అతడు పనిచేసుకుంటూనే డ్రైవ్ చేస్తున్నాడు.
వర్క్ ఆన్ బైక్ యువకుడి గురించి ఎవరు తీశారో గానీ… ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన వెంటనే సజ్జన్నార్ ప్రజలను హచ్చరిస్తూ ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. ఏ పనికైనా ఓ పద్దతి ఉంటుందని ఒకింత మర్యాదగానే సజ్జన్నార్ తన వార్నింగ్ ను మొదలుపెట్టారు.
ఈ వీడియోలోని యువకుడు చేస్తున్న వర్క్ ఆన్ బైక్ తీరు చూస్తుంటే… ఆత్రం ఎక్కువైతే ప్రాణాల మీదకు వస్తుందన్న విషయం అతడికి తెలియదేమో అని సజ్జన్నార్ వ్యాఖ్యానించారు. ఈ తరహా ఫీట్లతో తన ప్రాణంతో పాటు పక్కోడి ప్రాణాన్ని కూడా అతడు ప్రమాదంలోకి నెట్టేస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరగా కడుపు నింపుకోవడానికి చేసే పని కడతేర్చేలా మార్చుకోకూడదని సజ్జన్నార్ సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
