శ్రీవారి భ‌క్తులూ… ఇదేనా స్వామిపై మీ భ‌క్తి?

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిగా పూజలు అందుకునే తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు అనేక వ్యయ‌ ప్రయాసలకు ఓర్చుకుని తిరుమలకు చేరుకుంటారు. స్వామివారి పట్ల భక్తి ప్రప‌త్తులను చాటుకుంటారు. అయితే, తాజాగా తిరుమల శ్రీవారి భక్తులు వ్యవహరిస్తున్న తీరు పట్ల దేవస్థానం అధికారులు, అదేవిధంగా పాలకమండలి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.

శ్రీవారి భక్తులు హుండీలలో సమర్పించే కానుకల విషయంలో పాలకమండలి అదేవిధంగా అధికారులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితితో పాటు భక్తులను అనుమానించే దుస్థితి కూడా ఏర్పడిందని చెబుతున్నారు.

దీనికి ప్రధాన కారణం, కేంద్ర ప్రభుత్వం 2015 -16 మధ్య రద్దు చేసిన 500, వెయ్యి రూపాయల నోట్లను సమర్పించడంతోపాటు గత రెండేళ్ల కిందట రద్దు చేసిన రెండు వేల రూపాయల నోట్లను కూడా ఇప్పటికీ హుండీల‌లో భక్తులు సమర్పిస్తున్నారు. ఈ విధానం సరికాదనేది టీటీడీ పాలకమండలితో పాటు అధికారులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అటు పైకి చెప్పలేక, ఇటు ఈ విషయాన్ని సర్దుబాటు చేసుకోలేక నానా ప్రయాస పడుతున్నారు. టిటిడి అధికారిక లెక్కల ప్రకారం రద్దుచేసిన 500, వెయ్యి రూపాయల నోట్లు ఏకంగా 400 వందల కోట్ల రూపాయల పైబడి టిటిడి ఖజానాలో మూలుగుతున్నాయి.

వీటిని తీసుకునేందుకు అటు బ్యాంకులు మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ కూడా అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన పాత నోట్లను భద్రపరిచేందుకు నెల నెల తిరుమల తిరుపతి దేవస్థానం రెండు లక్షల రూపాయలను ఖర్చు చేస్తోంది.

మరోవైపు రెండు సంవత్సరాల కిందట రద్దు చేసిన రెండు వేల రూపాయల నోట్లును ఇప్పటికీ భక్తులు హుండీలలో సమర్పిస్తున్నారు. వీటి విలువ ప్రతి నెల 30 నుంచి 50 లక్షల రూపాయల మధ్య ఉందని అధికారులు చెబుతున్నారు.

ఈ నోట్లను కూడా బ్యాంకులు తీసుకోవడం లేదని తద్వారా వాటిని కూడా భద్రపరచాల్సిన పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తులు స్వామి పట్ల భక్తి ప్రభత్రులను చాటుకోవాలి తప్ప కానుకల హుండీని తమకు అనుకూలంగా మలుచుకోవ‌ద్ద‌ని సూచిస్తున్నారు.

తమ అవసరాలు తీర్చుకునేందుకు వినియోగించుకోరాదని పాలకమండలి విజ్ఞప్తి చేస్తోంది. స్వామి ప‌ట్ల భ‌క్తి ఉన్న‌వారుఎవ‌రూ ఇలా చేయ‌ర‌ని.. పేర్కొంది. ఈ విష‌యంలో భ‌క్తులు ఆలోచ‌న చేయాల‌ని పాల‌క మండ‌లి స‌హా అధికారులు చెబుతున్నారు.