నరాలు తెగే ఉత్కంఠ.. విజయ కిరీటం ఎవరిది?

​ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లన్నీ ఒక ఎత్తయితే, నరేంద్ర మోదీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన పోరు మరో ఎత్తు. చివరి ఓవర్ వరకు విజయం ఎటువైపు మొగ్గుతుందో తెలియని రీతిలో సాగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. గత సీజన్‌లో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చేతులెత్తేసిన రాజస్థాన్, ఈసారి ఒత్తిడిని జయించి మరీ విజయాన్ని అందుకుంది.

​ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (55), వైభవ్ సూర్యవంశీ (31) మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా, ధ్రువ్ జురెల్ 42 బంతుల్లోనే 75 పరుగులు చేసి జట్టు స్కోరు 200 దాటడంలో కీలక పాత్ర పోషించాడు. గుజరాత్ బౌలర్లలో రబడ రెండు వికెట్లు తీసినా, రాజస్థాన్ బ్యాటర్ల ధాటికి పరుగులు ధారాళంగా సమర్పించుకున్నారు. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ ఆఖరి వరకు పోరాడి 204 పరుగుల వద్ద ఆగిపోయింది.

​గుజరాత్ విషయానికి వస్తే సాయి సుదర్శన్ (73) అద్భుతమైన పోరాటంతో జట్టుకు విజయం ఖాయమనిపించాడు. అయితే మిడిల్ ఆర్డర్‌లో గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్ వంటి వారు తక్కువ స్కోర్లకే అవుట్ అవ్వడం టైటాన్స్ కొంపముంచింది. చివరలో రషీద్ ఖాన్ (24), రబడ (23 నాటౌట్) ధాటిగా ఆడుతుంటే రాజస్థాన్ క్యాంప్‌లో గుబులు మొదలైంది. రషీద్ ఖాన్ క్రీజులో ఉన్నంత సేపు మ్యాచ్ గుజరాత్ వైపే ఉన్నట్లు అనిపించింది. కానీ ఆఖరి ఓవర్లలో రాజస్థాన్ బౌలర్లు చూపిన క్రమశిక్షణే వారిని గెలిపించింది.

​చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి 11 పరుగులు కావాలి. క్రీజులో రషీద్, రబడ టెన్షన్ లేకుండా షాట్స్ ఆడుతుందడంతో అందరూ టైటాన్స్ గెలుస్తుందని భావించారు. కానీ కెప్టెన్ పరాగ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని బంతిని తుషార్ దేశ్‌పాండే చేతికి ఇచ్చాడు. దేశ్‌పాండే అద్భుతమైన యార్కర్లతో రషీద్ ఖాన్‌ను కట్టడి చేయడమే కాకుండా, వికెట్ తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. జోఫ్రా ఆర్చర్ కూడా 19 ఓవర్ తో పొదుపుగా బౌలింగ్ చేసి టైటాన్స్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ముఖ్యంగా దేశ్‌పాండే వేసిన ఆఖరి ఓవర్ ఈ సీజన్‌కే హైలైట్‌గా నిలిచింది.

​గతంలో రాజస్థాన్ ఉత్కంఠభరిత మ్యాచ్‌లలో ఓడిపోయే వారు, ఇప్పుడు పక్కా వ్యూహంతో ప్రత్యర్థిని దెబ్బకొడుతున్నారు. గుజరాత్ విషయానికి వస్తే, మిడిల్ ఆర్డర్‌లో బలం లేకపోవడం వారి పాలిట శాపంగా మారింది. సాయి సుదర్శన్ కష్టమంతా వృథా అయిపోయింది. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ వరుసగా మూడో విజయంతో టాప్‌లో కొనసాగుతుండగా, గుజరాత్ టైటాన్స్ తన లోపాలను సరిదిద్దుకోకపోతే కష్టమే.