ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని చవిచూసి అభిమానులను నిరాశలో నెట్టేసింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై పరాజయం పాలవ్వడానికి ప్రధాన కారణం పంజాబ్ బ్యాటర్ల పక్కా ప్లానింగ్ అనే చెప్పాలి. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. మొదట చెన్నై దూకుడుని ఆపి 209 పరుగులకు కట్టడి చేయడంలో సఫలమయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ లో ఎక్కడా ఒత్తిడికి లోనవ్వకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ఆడి 8 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. పంజాబ్ కు ఇది బ్యాక్ టు బ్యాక్ రెండో విజయం కావడం విశేషం.
సాధారణంగా చెన్నై తన సొంత మైదానం చెపాక్ లో తక్కువ స్కోర్లను కూడా కాపాడుకోవడంలో దిట్ట. కానీ ఈసారి పంజాబ్ బ్యాటర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య కేవలం 11 బంతుల్లోనే 39 పరుగులు బాది పవర్ప్లేలో ఇన్నింగ్స్ కు గట్టి పునాది వేశాడు. ఆ తర్వాత ప్రభ్సిమ్రాన్ సింగ్ (43), కూపర్ కానోలీ (36) వికెట్లు పడకుండా జాగ్రత్త పడుతూ స్కోరు బోర్డును పరిగెత్తించారు. పంజాబ్ బ్యాటింగ్ లో ఒకరు దూకుడుగా ఆడుతుంటే మరొకరు యాంకర్ రోల్ పోషిస్తూ ఇన్నింగ్స్ ను నడిపించారు. దీనివల్ల రన్ రేట్ ఎక్కడా తగ్గకుండా పంజాబ్ జాగ్రత్త పడింది.
చెన్నై బ్యాటింగ్ లో ఆయుష్ మాత్రే 73 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా అది జట్టును గట్టెక్కించలేకపోయింది. శివం దూబే (45), సర్ఫరాజ్ ఖాన్ (32) పర్వాలేదనిపించినా చెన్నై స్కోరు 220 దాటుతుందనుకున్న దశలో పంజాబ్ బౌలర్లు కట్టడి చేశారు. చెన్నై కనీసం ఒక 15 పరుగులు తక్కువ చేసిందనేది వాస్తవం. బౌలింగ్ లో కూడా సీఎస్కే కీలక సమయాల్లో విఫలమైంది. పంజాబ్ బ్యాటర్లకు కొంత అదృష్టం తోడవడంతో పాటు వారు అటాకింగ్ గేమ్ ఆడటం చెన్నై బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టింది.
మ్యాచ్ క్లైమాక్స్ లో ఒక చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది. నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ ను విజయతీరాలకు చేరుస్తున్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 52 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. వెంటనే నెహాల్ వధేరా కూడా పెవిలియన్ కు చేరడంతో చెన్నై క్యాంప్ లో ఆశలు చిగురించాయి. వికెట్లు టకటక పడితే మ్యాచ్ తమ వైపు తిరుగుతుందని చెన్నై ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ ఆ అంచనాలను పటాపంచలు చేస్తూ శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్ ఏమాత్రం బెరకకుండా నిలబడ్డారు. ఎటువంటి కంగారు పడకుండా క్లియర్ షాట్స్ తో మ్యాచ్ ను ఫినిష్ చేసి పంజాబ్ కు ఘనవిజయాన్ని అందించారు.
ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లతో పోలిస్తే ఈ మ్యాచ్ లో పంజాబ్ ఆడిన తీరు చాలా డిఫరెంట్ గా ఉంది. ఈసారి మాత్రం చాలా కంట్రోల్డ్ గా, క్యాలిక్యులేటెడ్ గా ఛేజింగ్ చేసింది. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ మార్పులు చేసినా అవి పెద్దగా ఫలించలేదు. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో టాప్ లోకి దూసుకెళ్లగా.. చెన్నై టేబుల్ లిస్టులో చివరలోనే ఉండిపోతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
