కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కేరళలోని ఎల్డీఎఫ్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. పేదలను పట్టించుకోవడంలేదని.. బీజేపీతో అంటగాకుతున్న సీఎం విజయన్.. రాష్ట్రాన్ని గాలికి వదిలేశారని వ్యాఖ్యానించారు. కేరళలో నిరుద్యోగం ప్రబలుతోందని.. పాలన కూడా గాడి తప్పిందని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ వ్యాఖ్యలకు విజయన్ సూటిగా బదులిస్తూ.. సెగ పెంచేశారు.
మీరు మాదగ్గర నేర్చుకుంటున్నారు!
కేరళలో జరుగుతున్న పాలనను అధ్యయనం చేసేందుకు ఇటీవల తెలంగాణ అధికారులు తిరువనంతపురం వచ్చి.. రెండు రోజుల పాటు అధ్యయనం చేశారని సీఎం విజయన్ ప్రస్తావించారు. `మీకు పాలన చేతనైతే.. మా దగ్గరకు ఎందుకు వచ్చారు“ అని నిలదీశారు. ముఖ్యంగా భూముల రికార్డుల సేకరణ, భద్రత వంటి అంశాలపై గత ఏడాది తెలంగాణ అధికారులు కేరళకు వెళ్లారు. ఈ విషయాన్ని విజయన్ ప్రస్తావిస్తూ.. రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు.
పేదలపై బుల్డోజర్!
పేదలను గాలికి వదిలేస్తున్నారన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలను అంతే తీవ్రంగా విజయన్ తిప్పికొట్టారు. “పేదల ఇళ్లపైకి మీరు బుల్ డోజర్లు పంపిస్తున్నారు.(మూసీ ప్రక్షాళనలో భాగంగా.. హైడ్రా చర్యలు) మీరు మాకు చెబుతున్నారు. పేదలను ఎలా ట్రీట్ చేయాలో మీ నుంచి మేం నేర్చుకోవాలా?“ అని వ్యాఖ్యానించారు. “తెలంగాణలో పేదలకు నిలువ నీడ తీసేస్తున్న ఒకాయన.. మనకు పాఠాలు చెప్పేందుకు వచ్చారు.“ అని ఎద్దేవా చేశారు. కేరల అన్నిరంగాల్లోనూ సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి సాధిస్తోందని అన్నారు.
అవినీతిలో మీరే ముందు!
ఇక, కేరళలో అవినీతి పెరిగిపోయిందన్న రేవంత్ వ్యాఖ్యలను కూడా కేరళ సీఎం తిప్పికొట్టారు. “ఎవరి లెక్కలు ఏంటో చెబుతా“ అంటూ.. ఆయన నీతి ఆయోగ్ గణాంకాలను వెల్లడించారు. దేశంలో అతితక్కువ అవినీతి ఉన్న రాష్ట్రం కేరళ అని నీతి ఆయోగే చెప్పిందన్నారు. అవినీతి తక్కువ ఉన్న రాష్ట్రాల జాబితాలో కేరళ 1వ స్థానంలో ఉంటే.. తెలంగాణ 6వ స్థానంలో ఉందన్నారు. దీనిని బట్టి ఎవరి రాష్ట్రంలో ఎవరు అవినీతి చేస్తున్నారో తెలియడం లేదా? అని ప్రశ్నించారు.
తెలంగాణే పేదరికానికి కేరాఫ్..
కేరళలో పేదరికం పెరుగుతోందని.. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపైనా విజయన్ మండిపడ్డారు. కేరళలో పేదరికం 0.55 శాతమని.. అదే తెలంగాణలో 5.88 శాతంగా ఉందన్నారు. ఇది రేవంత్కు మచ్చగా కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. అదేవిధంగా కేరళలో అక్షరాస్యత 95.3 శాతం ఉండగా, తెలంగాణలో 76.9 శాతం వద్దే ఆగిపోయిందని వ్యాఖ్యానించారు. కేవలం కొందరి ప్రోద్బలంతో రాజకీయ విమర్శలు చేసేందుకు మాత్రమే రేవంత్ వచ్చారని వ్యాఖ్యానించారు. నిజాలు తెలుసుకుంటే.. ఆయన ఎల్ డీఎఫ్ తరఫునే ప్రచారం చేస్తారని విజయన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
