కోహ్లీకి అలా.. నటరాజన్‌కు ఇలా

భారత క్రికెట్ జట్టు ఇప్పుడు తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఘోర పరాభవం పాలైంది టీమ్ ఇండియా. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే కుప్పకూలి అవమాన భారాన్ని మూటగట్టుకుంది. ఆ మ్యాచ్‌లో చిత్తుగా ఓడి ఆత్మవిశ్వాసం దెబ్బ తిన్న స్థితిలో జట్టుకు మూల స్తంభం అయిన విరాట్ కోహ్లికి స్వదేశానికి వచ్చేస్తున్నాడు. అతను చివరి మూడు టెస్టులకూ అందుబాటులో ఉండడు. తన భార్య అనుష్క శర్మ తొలి బిడ్డకు జన్మనిస్తుండటంతో అతను స్వదేశానికి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే.

ఒక ప్రతిష్టాత్మక సిరీస్‌లో జట్టు తొలి మ్యాచ్ ఓడి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండగా కోహ్లి ఇలా వచ్చేయడం కరెక్టా అన్న ప్రశ్న తలెత్తుతోంది. కానీ తొలిసారి తండ్రి కావడంలో ఉన్న అనుభూతిని ఆస్వాదించడానికి కోహ్లి అలా వెళ్లిపోవడంలో తప్పేమీ లేదన్న వాదనా ఉంది. వ్యక్తిగత జీవితం కూడా ముఖ్యమే అన్న అభిప్రాయాలూ ఉన్నాయి.

ఐతే ఒకప్పుడు మహేంద్రసింగ్ ధోని జట్టు కోసం తొలి బిడ్డ ప్రసవానికి దూరంగా ఉన్నాడు. బిడ్డ పుట్టిన కొన్ని వారాల తర్వాతే వెళ్లి చూశాడు. అలా కోహ్లి చేసి ఉండొచ్చు కదా అన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. గతం సంగతి వదిలేస్తే ప్రస్తుతం భారత జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు జట్టు కోసం చేసిన త్యాగాలు ప్రస్తావనార్హం. మహ్మద్ సిరాజ్ తండ్రి గత నెలలో చనిపోయాడు. అతనప్పటికి ఆస్ట్రేలియాలో ఉన్నాడు. స్వదేశానికి వచ్చి తండ్రిని చివరి చూపు చూసి వెళ్తే అతను మళ్లీ క్వారంటైన్లో ఉండాలి. ఇదంతా ఎందుకని అతను ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు.

ఇక తమిళనాడు ఫాస్ట్ బౌలర్ నటరాజన్ విషయానికి వస్తే.. అతడికి ఇటీవలే తొలి బిడ్డ పుట్టింది. అతను వాస్తవానికి యూఏఈలో ఐపీఎల్ ముగిశాక స్వదేశానికి వచ్చేయాల్సింది. కానీ నెట్ బౌలర్‌గా అతణ్ని ఆస్ట్రేలియాకు తీసుకెళ్లారు. తర్వాత అనుకోకుండా వన్డేలు, టీ20ల్లో ఆడే అవకాశం దక్కింది. టెస్టు జట్టులో నటరాజన్‌కు చోటు లేదు. అయినా సరే.. అతణ్ని స్వదేశానికి పంపించలేదు. టెస్టు సిరీస్‌కు నెట్ బౌలర్‌‌గా కొనసాగించారు. అతను జనవరి నెలాఖర్లో కానీ స్వదేశానికి రాడు. ఒక జూనియర్ ఆటగాడికి మాత్రం తొలి బిడ్డ ప్రసవం కీలకం కాదా.. అతణ్ని నెట్ బౌలర్‌గా అలాగే ఆస్ట్రేలియాలో ఉంచేస్తారా.. కానీ జట్టులో కీలక ఆటగాడైన కోహ్లి టీమ్ ఇండియా కష్టాల్లో ఉండగా వదిలేసి స్వదేశానికి వెళ్తానంటే బీసీీసీఐ ఎలా సరే అంది అంటూ దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ ఓ కాలమ్‌లో పరోక్షంగా ప్రశ్నలు సంధించాడు.