ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధ ప్రభావం పలు దేశాలపై పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా రోజులుగా భారత్ లో వంటగ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడింది. ఇప్పుడు తాజాగా ఆ సెగ పెట్రోల్, డీజిల్ కు కూడా తాకింది. ఈ నేపథ్యంలోనే ఇరు తెలుగు రాష్ట్రాలలో చాలా పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. ప్రత్యేకించి హైదరాబాదులో చాలా బంకుల్లో స్టాక్ లేకపోవడంతో పెట్రోల్, డీజిల్ స్టాక్ ఉన్న బంకుల దగ్గర జనాలు బారులు తీరారు.
తమ వాహనాలతో కొంతమంది, కంటైనర్లలో డబ్బాలలో పెట్రోల్ ను నిల్వ చేసుకొని మరి కొంతమంది తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ నిల్వలకు ఢోకా లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం బంకులు మూతపడతాయి అన్న వదంతులతో పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకునేందుకు బారులు తీరుతున్నారు.
ఇదే విషయంపై వదంతులు నమ్మవద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ప్రకటన చేసినా ఫలితం లేదు. మరోవైపు అవసరానికి మించి పెట్రోల్ నిల్వ చేసుకోవద్దని, రాష్ట్రంలో ఇంధన కొరత లేదని తెలంగాణ పెట్రోలియం అసోసియేషన్ ప్రకటించింది. తెలంగాణలోని అన్ని పెట్రోలియం కంపెనీల్లో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలున్నాయని ప్రకటన విడుదల చేసింది.
ప్రజలెవరూ కంగారు పడొద్దని, వదంతులు నమ్మవద్దని, అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ నిల్వలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేసింది. గతంలో మాదిరిగానే రోజువారి అవసరానికి తగ్గట్టు పెట్రోల్ కొనుగోలు చేయాలని ప్రజలకు అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు
Gulte Telugu Telugu Political and Movie News Updates
