13 వేల కోట్ల రాయల్ డీల్ వెనుక ఎవరున్నారు?

ఐపీఎల్ అంటేనే కాసుల వర్షం.. కానీ ఇప్పుడు ఒక జట్టు ఏకంగా బిలియన్ డాలర్ల మార్కును దాటి అందరినీ ఆశ్చర్యపరిచింది. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కల్ సోమనీ నేతృత్వంలోని బృందం సుమారు 1.63 బిలియన్ డాలర్లకు (దాదాపు 13,600 కోట్ల రూపాయలు) కొనుగోలు చేసింది. ఐపీఎల్ మొదలైన కొత్తలో కేవలం 280 కోట్లకే అమ్ముడైన ఈ జట్టు, ఇప్పుడు వేల కోట్ల విలువ పలకడం విశేషం.

ఈ భారీ డీల్ వెనుక అమెరికాకు చెందిన దిగ్గజ వ్యాపారవేత్తల అండ ఉంది. వాల్‌మార్ట్ కుటుంబానికి చెందిన రాబ్ వాల్టన్, ఎన్‌ఎఫ్ఎల్ జట్టు డెట్రాయిట్ లయన్స్‌లో వాటాలు ఉన్న హాంప్ ఫ్యామిలీ ఈ కొత్త యాజమాన్యంలో భాగస్వాములుగా ఉన్నారు.

కల్ సోమనీ అనే వ్యక్తికి గతంలోనే ఈ జట్టులో కొన్ని వాటాలు ఉండగా, ఇప్పుడు ఆయన పూర్తి స్థాయిలో జట్టును చేజిక్కించుకున్నారు. అయితే ఇప్పుడు ఐపీఎల్ 2026 సీజన్ మొదలవుతోంది కాబట్టి, ప్రస్తుతానికి పాత మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలోనే మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ సీజన్ ముగియగానే కొత్త యజమానులు అధికారికంగా బాధ్యతలు తీసుకుంటారు.

ఒకప్పుడు ఈ జట్టులో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా పార్ట్నర్లుగా ఉండేవారు. కానీ 2015లోనే వారు తమ వాటాలను వదిలేశారు. ప్రస్తుతం మనోజ్ బదాలేకు చెందిన ఎమర్జింగ్ మీడియా సంస్థ తన 100 శాతం వాటాను కల్ సోమనీ బృందానికి విక్రయించింది. గతంలో సంజీవ్ గోయెంకా లక్నో సూపర్ జెయింట్స్ జట్టును 940 మిలియన్ డాలర్లకు కొన్నారు. అప్పట్లో అదే పెద్ద రికార్డు, కానీ ఇప్పుడు రాజస్థాన్ ఆ రికార్డులను తిరగరాసి ఫస్ట్ బిలియన్ డాలర్ టీమ్ గా నిలిచింది.

కల్ సోమనీ కేవలం స్పోర్ట్స్ మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ టెక్నాలజీ, ఏఐ గవర్నెన్స్ వంటి రంగాల్లో కూడా దిగ్గజ సంస్థలను నడుపుతున్నారు. ఆయనకు ఉన్న అంతర్జాతీయ నెట్‌వర్క్ వల్ల రాజస్థాన్ రాయల్స్ బ్రాండ్ వాల్యూ ప్రపంచవ్యాప్తంగా మరింత పెరిగే అవకాశం ఉంది.

ఐపీఎల్ ఫ్యూచర్ మీద ఉన్న నమ్మకంతోనే ఆయన ఇంత భారీ పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ తో పాటు త్వరలో ఆర్‌సీబీ జట్టు అమ్మకం కూడా జరిగే అవకాశం ఉంది, దాని ధర ఏకంగా 16 వేల కోట్లు దాటుతుందని అంచనా. ఐపీఎల్ జట్ల విలువ రోజురోజుకూ మరింత పెరుగుతోంది. ఒకప్పుడు తక్కువ రేటుకు అమ్ముడైన జట్లు కూడా ఇప్పుడు వేల కోట్ల విలువ పలుకుతుండటం చూస్తుంటే, క్రికెట్ బిజినెస్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.