భారతదేశంలో డాక్టర్ వృత్తికి ఉన్న గౌరవం అందరికీ తెలిసిందే, కానీ ఇప్పుడు అదే వృత్తిలో ఉన్నవారు తమ పిల్లలను డాక్టర్లుగా చూడటానికి ఇష్టపడటం లేదు. దాదాపు 91 శాతం మంది భారతీయ వైద్యులు తమ వారసులు మెడిసిన్ కెరీర్ను ఎంచుకోవద్దని కోరుకుంటున్నట్లు డెబబ్రత మితాలి ఆరో ఫౌండేషన్ జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది. 1,200 మంది ఫిజీషియన్లపై జరిపిన ఈ అధ్యయనంలో మెజారిటీ డాక్టర్లు విపరీతమైన పని ఒత్తిడి, దాడుల భయం వల్ల ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. సుమారు 84 శాతం మంది వైద్యులు రోగులు లేదా వారి బంధువుల చేతిలో అవమానాలకు గురవుతామనే ఆందోళనతో విధులు నిర్వహిస్తున్నారు.
వైద్యులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి సుదీర్ఘమైన చదువు, సెటిల్ అవ్వడానికి పట్టే సమయం. ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి ఐదు నుంచి ఏడేళ్లు, ఆ తర్వాత పీజీ కోసం మరో రెండేళ్లు, ఇక సొంతంగా గుర్తింపు తెచ్చుకుని స్థిరపడాలంటే కనీసం 35 ఏళ్ల వయస్సు రావాలి. అంటే జీవితంలో సగం కాలం కేవలం పుస్తకాలతోనే గడిపేయాల్సి వస్తోంది. తోటి స్నేహితులు సాఫ్ట్వేర్ లేదా ఇతర రంగాల్లో 25 ఏళ్లకే సెటిల్ అవుతుంటే, తాము మాత్రం 30 ఏళ్లు దాటినా ఇంకా చదువుకుంటూనే ఉండటం ఒక రకమైన ‘మెంటల్ టార్చర్’గా మారుతోంది. ఈ సుదీర్ఘ నిరీక్షణే వారిలో అసహనాన్ని పెంచుతోంది.
ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా మరో పెద్ద సమస్యగా మారాయి. మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే వారికి డాక్టర్ చదువు ఇప్పుడు అందని ద్రాక్షలా మారుతోంది. పీజీ సీటు కోసం ప్రైవేటులో కోట్లకు మించిన ఫీజులు కట్టడం సామాన్యులకు సాధ్యం కాని పని. లోన్ల మీద ఆధారపడి చదివితే, కెరీర్ మొదట్లోనే అప్పుల టెన్షన్ వెంటాడుతోంది. ఇంత ఖర్చు చేసి, ఇన్నేళ్లు కష్టపడినా చివరకు వచ్చే ఆదాయం పెట్టిన పెట్టుబడికి ఏమాత్రం సరిపోవడం లేదు. 67 శాతం మంది డాక్టర్లు తమ కెరీర్లో మెడికో లీగల్ కేసులను ఎదుర్కోవడం వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లలో డిప్రెషన్ రేటు 29 శాతంగా ఉంటే, భారత్లో అది 78 శాతానికి పైగా ఉండటం ఆందోళనకరమైన విషయం. రాత్రి పగలు తేడా లేకుండా చేసే డ్యూటీలు, సెలవులు లేని జీవితం వల్ల కుటుంబానికి కనీస సమయం కేటాయించలేకపోతున్నామని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 60 శాతానికి పైగా డాక్టర్లు సమాజంలో తమ పట్ల నమ్మకం తగ్గిందని భావిస్తున్నారు. ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్నా, చిన్న పొరపాటు జరిగినా దాడులు చేయడం లేదా కోర్టులకు లాగడం వంటి పరిణామాలు వారిని ఈ వృత్తి నుంచి దూరం చేస్తున్నాయి.
ప్రస్తుతం దేశంలో ప్రతి 1,456 మందికి కేవలం ఒక డాక్టర్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. రాబోయే తరం ప్రతిభావంతులు మెడిసిన్ వైపు రాకపోతే, ఈ అంతరం మరింత పెరిగి ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. కేవలం జీతాలు పెంచడమే కాకుండా, డాక్టర్లకు పని ప్రదేశంలో తగిన రక్షణ కల్పించడం ఇప్పుడు అత్యంత ముఖ్యం. భద్రతపై భరోసా లేకపోవడం, ఫీజుల భారం, సుదీర్ఘ కాలం శ్రమించాల్సి రావడమే మెజారిటీ వైద్యులు తమ వారసులను ఈ రంగంలోకి పంపకూడదని నిర్ణయించుకోవడానికి అసలైన కారణాలని తెలుస్తోంది.
This post was last modified on March 2, 2026 11:10 pm
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…