కాకినాడ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెం–జి.మేడపాడు గ్రామాల మధ్య ఉన్న ‘సూర్యశ్రీ ఫైర్ వర్క్స్’ బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం సంభవించిన భారీ పేలుడులో కనీసం 18 మంది కార్మికులు సజీవ దహనమైనట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది.
మృతుల్లో అధిక శాతం మహిళా కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో కార్మికులు బాణసంచా తయారీ పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి కర్మాగార భవనం భాగాలు ధ్వంసమయ్యాయి. మృతదేహాలు, శరీర భాగాలు సమీపంలోని పంట పొలాల్లోకి ఎగిరిపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద సమయంలో సుమారు 30 మంది వరకు కార్మికులు విధుల్లో ఉన్నట్లు సమాచారం.
పేలుడు అనంతరం మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల పనిచేస్తున్న కార్మికులు బయటకు రావడానికి వీలుకాలేదు. ఇంకా 15 మందికి పైగా కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగించి మిగిలిన వారిని వెతికే చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ప్రాంతంలో గతంలోనూ ఇలాంటి పేలుడు ఘటనలు చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. భద్రతా ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యం కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి గల ఖచ్చిత కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి, బాధితులకు తక్షణ సాయం అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. సహాయక చర్యలను ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని, మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
మంత్రి నారా లోకేష్ కూడా ఘటనపై స్పందిస్తూ తీవ్ర విషాదం వ్యక్తం చేశారు. మృతులకు నివాళులు అర్పిస్తూ, బాధిత కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ప్రమాదంపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఘటనతో ప్రాంతమంతా శోకసంద్రంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates