వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు తమ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు ప్రమాణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని డ్రాఫ్ట్ నియమాల్లో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి ఫిబ్రవరి 20, 2026న అసెంబ్లీలో ప్రకటించారు.
డ్రాఫ్ట్ ప్రకారం, వధూవరులు దరఖాస్తులో తమ తల్లిదండ్రుల పేర్లు, చిరునామాలు, ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్లు నమోదు చేయాలి. దరఖాస్తు అందుకున్న 10 పని రోజులలోగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇరువురి తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ ద్వారా అధికారిక సమాచారం అందజేయాలి. దరఖాస్తు చేసిన తేదీ నుంచి 30 రోజుల ధృవీకరణ ప్రక్రియ పూర్తైన తర్వాతే వివాహ నమోదు ధ్రువపత్రం జారీ చేయనున్నారు. అలాగే పెళ్లి ఫొటోలు, వీడియోలు, సాక్షుల వివరాలను ప్రభుత్వ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
“లవ్ జిహాద్” పేరుతో జరిగే మోసాలు, రహస్య వివాహాలను అరికట్టడం, కుటుంబ వ్యవస్థను కాపాడడం లక్ష్యంగా ఈ మార్పులు తీసుకువస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. ప్రేమ వివాహాలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, కానీ మోసపూరిత ఘటనలను నిరోధించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు అవసరమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి 30 రోజుల పాటు అభిప్రాయాలు సేకరించనున్నారు. బీజేపీ నాయకులు ఈ మార్పులను సమర్థిస్తూ కుటుంబాలకు రక్షణ కల్పించే చర్యగా అభివర్ణిస్తున్నారు. అయితే కాంగ్రెస్ సహా కొందరు ప్రతిపక్ష నాయకులు, న్యాయ నిపుణులు ఈ నిబంధనలు పెద్దల గోప్యతా హక్కులను ఉల్లంఘించే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates