అదృష్టం ఎప్పుడు ఎలా వరిస్తుందో అసలే అర్థం కాదు. ఎలాంటి ఆలోచన లేకుండా.. కేవలం సరదాగా కొన్న ఒక డొమైన్ ఒక వ్యక్తిని వందల కోట్ల అధిపతిగా మార్చింది. ఇంటర్నెట్ చరిత్రలో అత్యంత ఖరీదైన డీల్ గా చెబుతున్న ఈ ఉదంతం గురించి వింటే విస్మయంతో నోరెళ్లబెట్టాల్సిందే. రీల్ స్టోరీకి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉన్న ఈ ఉదంతం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆకర్షిస్తోంది.
వివరాల్లోకి వెళితే..
అవును.. ఒక డొమైన్ పేరు అక్షరాల రూ.634 కోట్లకు అమ్ముడైంది. ఆశ్చర్యకరంగా ఆ డొమైన్ ను సదరు వ్యక్తి కేవలం రూ.300లకే కొన్నాడు. అది కూడా సరదాగా. తన తల్లి క్రెడిట్ కార్డుతో.. తన పేరులోని మొదటి రెండు అక్షరాలతో కొన్న ఆ డొమైన్ ఇప్పుడు వందల కోట్ల కాసుల్ని కురిపిస్తోంది.
ఇంతకూ ఆ డొమైన్ పేరు మరేమిటో కాదు.. ప్రపంచ గమనాన్ని పూర్తిగా మార్చేసే సత్తా ఉందని చెప్పే ఏఐ పేరుతో రిజిస్టర్ చేసిన డొమైన్ అది. ఏఐకు ఎంత క్రేజ్ ఉంది. మరెంత ఫ్యూచర్ ఉందన్న విషయం ఈ డొమైన్ కొనుగోలు చేసిన తీరు.. అందుకు పెట్టిన డబ్బుల్ని చూస్తేనే అర్థమవుతుంది.
AI.com అనే డొమైన్ మలేషియాకు చెందిన అర్యన్ ఇస్మాయిల్ అనే టెకీ ఎంట్రప్రెన్యూర్ వద్ద ఉంది. అతడి పదేళ్ల వయసులో అంటే 1993లో తన తల్లి క్రెడిట్ కార్డును ఉపయోగించి తన పేరులోని రెండు పదాల మొదటి అక్షరాల్ని కలిపి (ఆర్యన్ (A) ఇస్మాయిల్ (I) ‘‘AI.COM’’ పేరుతో డొమైన్ ను రిజిస్టర్ చేశాడు. దీనికి అతను చేసిన ఖర్చు రూ.300 మాత్రమే. నిజానికి అప్పటికి అతనికి ఏఐ మీద కనీస అవగాహన కూడా లేదట. ఇక.. అతడి తల్లికి అయితే డొమైన్ అంటే ఏమిటో కూడా తెలీదట.
ఆమెకు క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్ వచ్చిన తర్వాత తన కొడుకు చేసిన ఖర్చు అర్థం కాక తల పట్టుకుందట. కట్ చేస్తే.. ఇప్పుడు ఏఐ జోరు ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టెక్ దిగ్గజ కంపెనీల మధ్య జరుగుతున్న ఏఐ వార్ వేళ..ఈ రంగంలో తన అధిక్యతను ప్రదర్శించుకోవటం కోసం AI.com డొమైన్ ను కొనుగోలు చేసేందుకు క్రిప్టో.కామ్ సీఈవో క్రిస్ మార్జాలెక్ ఏకంగా రూ.634 కోట్లు చెల్లించి డొమైన్ ను సొంతం చేసుకోవటం పెను సంచలనంగా మారింది.
ఇప్పటివరకు ఒక డొమైన్ ను అత్యధిక ధరకు అమ్మిన డొమైన్పేరు కార్ ఇన్స్యూరెన్స్.కామ్ (carInsurance.com)గా ఉండేది. ఈ డొమైన్ కొనుగోలుకు 2010లో 49.7 మిలియన్ డాలర్లు (ఇప్పటి మన మారకం ధర ప్రకారం రూపాయిల్లో చెబితే రూ.450.42 కోట్లు)అమ్ముడైంది.
అదే 2010లో ఉన్న డాలర్ తో రూపాయి మారకం విలువతో చూస్తే రూ.227.16 కోట్లు. తాజా డీల్ తో ఇంటర్నెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన డొమైన్ డీల్ గా చెబుతున్నారు. అది కూడా రెండు అక్షరాల కోసం కావటం గమనార్హం.
ఇన్ని వందల కోట్లు ఖర్చు చేసి సదరు డొమైన్ కొనటానికి కారణం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి క్రిస్ మార్జాలెక్ వద్ద పక్కా ప్లాన్ ఉంది.
ఒక భారీ కన్స్యూమర్ ఏఐ ప్లాట్ ఫాంను లాంచ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ఈ ఫ్లాట్ ఫాంతో వ్యక్తిగత పనులు చక్కబెట్టే ఏఐ ఏజెంట్లు.. స్టాక్ ట్రేడింగ్, మెసేజింగ్ లాంటి సేవల్ని ఈ ఫ్లాట్ ఫారమ్ అందించనుంది. ఈ భారీ ప్రణాళికతోనే అంత భారీ ధర పెట్టి డొమైన్ కొన్నట్లుగా పేర్కొన్నారు. మరి.. ఆయన తన సేవల్ని ఎప్పటికి అందుబాటులోకి తెస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates