టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్తో మ్యాచ్ ఆడబోమంటూ గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ చేసిన హడావుడి ఎట్టకేలకు నవ్వులపాలై ముగిసింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నుంచి ఎదురైన గట్టి హెచ్చరికలు, అన్నీ వైపుల నుంచి వచ్చిన ఒత్తిడితో పాక్ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన హై వోల్టేజ్ మ్యాచ్లో పాల్గొంటున్నట్లు పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించింది. దీంతో గత కొద్దిరోజులుగా సాగిన ‘బైకాట్’ డ్రామాకు తెరపడింది.
నిజానికి పాకిస్థాన్ పెట్టిన వింత డిమాండ్లన్నింటినీ ఐసీసీ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. బంగ్లాదేశ్ అంశాన్ని సాకుగా చూపి నష్టపరిహారం ఆశించిన పాక్ ఆశలపై ఐసీసీ నీళ్లు చల్లింది. నిబంధనల ప్రకారం వెళ్తే సభ్యత్వం కోల్పోయే ప్రమాదం ఉందని గ్రహించిన పాక్ బోర్డు, తన పంతాన్ని వీడి దారిలోకి వచ్చింది. గర్వంతో నిన్నమొన్నటి వరకు ఊగిసలాడిన పాక్, ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక అసలు కారణం మనుగడ కోసమేనని స్పష్టమవుతోంది.
ఈ యూటర్న్ తీసుకోవడానికి పాక్ ఒక కొత్త సాకును వెతుక్కుంది. క్రికెట్ ఎకోసిస్టమ్ బాగుండాలని, ఆట యొక్క స్ఫూర్తిని కాపాడాలనే ఉద్దేశంతోనే తాము ఆడుతున్నట్లు ఒక ‘కవరింగ్’ స్టేట్మెంట్ ఇచ్చింది. బంగ్లాదేశ్, శ్రీలంక బోర్డులు చేసిన రిక్వెస్ట్ మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే లోపల అసలు విషయం మాత్రం ఐసీసీ నుంచి రాబోయే భారీ జరిమానాలు, ఆంక్షల భయమేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రపంచ క్రికెట్లో భారత్ పాక్ మ్యాచ్కు ఉండే క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. కమర్షియల్గా కూడా అత్యంత విలువైన ఈ మ్యాచ్ను మిస్ చేసుకుంటే పీసీబీకి కోలుకోలేని ఆర్థిక దెబ్బ తగిలేది. అందుకే అటు ప్రభుత్వం, ఇటు బోర్డు కలిసి ఈ వివాదాన్ని ఇక సాగదీయలేక గౌరవప్రదంగా తప్పుకోవడానికి ప్రయత్నించారు. ఎంత డ్రామా చేసినా చివరికి ఇండియా ముందుకు వచ్చి తలవంచక తప్పదని మరోసారి రుజువైంది.
మొత్తానికి పాక్ తన వంకర బుద్ధితో చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. ఇప్పుడు పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని కాపాడుకోవాలన్నా, వరల్డ్ కప్ రేసులో నిలవాలన్నా పాక్కు భారత్తో ఆడటం తప్ప మరో మార్గం లేదు. మరి మైదానంలో పాక్ ఏమాత్రం పోటీ ఇస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates