బాధను మాయం చేసే ‘స్మృతి’ సీక్రెట్!

పెళ్లి రద్దయిన తర్వాత స్మృతి మంధాన మానసికంగా కృంగిపోతారని, కొన్నాళ్ళు బయట కనిపించరని చాలామంది అనుకున్నారు. కానీ ఆమె అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అమెజాన్ సంభవ్ సమ్మిట్ లో సందడి చేశారు. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, వాటిని ఎలా అధిగమిస్తారనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు అందరి చేత చప్పట్లు కొట్టిస్తోంది.

తనకు క్రికెట్ కంటే ఇష్టమైనది మరొకటి లేదని స్మృతి తేల్చి చెప్పారు. జీవితంలో క్లిష్ట సమయాలు ఎదురైనప్పుడు, టీమిండియా జెర్సీ వేసుకోగానే ఆ బాధలన్నీ మాయమైపోతాయని ఆమె అన్నారు. దేశం కోసం ఆడుతున్నామనే ఒక్క ఆలోచన మనసులో ఉంటే చాలు, ఇక వ్యక్తిగత సమస్యలు అన్నీ పక్కకు వెళ్లిపోతాయని, అదే తనను ముందుకు నడిపిస్తుందని వివరించారు.

ఇటీవల వరల్డ్ కప్ గెలిచిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆమె కాస్త ఎమోషనల్ అయ్యారు. అది రాత్రికి రాత్రి వచ్చిన విజయం కాదు, ఏళ్ళ తరబడి చేసిన పోరాటానికి దక్కిన ప్రతిఫలం అని చెప్పారు. ముఖ్యంగా స్టేడియంలో మిథాలీ రాజ్, జులన్ గోస్వామి వంటి లెజెండ్స్ కళ్లలో ఆనంద బాష్పాలు చూశాక, నిజమైన మహిళా క్రికెట్ గెలిచినట్లు అనిపించిందని స్మృతి వ్యాఖ్యానించారు.

చిన్నప్పటి నుంచి తనకు బ్యాటింగ్ అంటే పిచ్చి అని, వరల్డ్ ఛాంపియన్ అనిపించుకోవాలనే కసి ఎప్పుడూ తనలో ఉండేదని ఆమె తెలిపారు. అయితే నిన్నటి మ్యాచ్ లో సెంచరీ కొట్టినా సరే, ఈరోజు మళ్ళీ సున్నా నుంచే ఇన్నింగ్స్ మొదలుపెట్టాలనే కఠినమైన సత్యాన్ని తాను బలంగా నమ్ముతానని, అదే తన సక్సెస్ సీక్రెట్ అని వెల్లడించారు.

వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు కుంగిపోకుండా, కెరీర్ ను ప్రేమిస్తే ఎలాంటి డిప్రెషన్ అయినా దరిచేరదని స్మృతి మాటలు నిరూపిస్తున్నాయి. తన కోసం కాకుండా టీమ్ కోసం ఆడాలనే ఆమె ఆలోచన యువ క్రీడాకారులకు ఒక పెద్ద పాఠం. కష్టాల్లో ఉన్నప్పుడు మన పనిని మనం ప్రేమిస్తే చాలు, అదే మనల్ని గట్టెక్కిస్తుందని ఆమె నేటి తరానికి చాటిచెప్పారు.