షాకింగ్ నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది కర్ణాటక. ఇటీవల కాలంలో వెలుగు చూసిన దారుణ నేరాలు ఆ రాష్ట్రంలో చోటు చేసుకోవటం కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పేది కూడా ఆ కోవకు చెందినదే. కారు సైడ్ మిర్రర్ కు బైక్ తాకిందన్న ఆగ్రహంతో.. ఆ బైక్ ను ఛేజ్ చేసుకుంటూ వెళ్లటమే కాదు.. ఆ వ్యక్తిని తమ కారుతో గుద్దేసి చంపేసిన ఆరాచకం కర్ణాటకలో చోటు చేసుకుంది. ఈ ఉదంతంలో మరో భయంకర ట్విస్టు ఏమంటే.. కారుతో చంపేసింది దంపతులు కావటం.
బెంగళూరులోని పుట్టేనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 22 అర్థరాత్రి దర్శన్ తన ఫ్రెండ్ వరుణ్ తో కలిసి శ్రీరామ లేఅవుట్ లో బైక్ మీద వెళుతున్నాడు. ఈ సమయంలో వారికి పక్కగా వెళుతున్న కారు సైడ్ మిర్రర్ కు వీరి బైక్ తాకింది. దీంతో.. కారులో ప్రయాణిస్తున్న మనోజ్ కుమార్.. అతడి భార్య అరతిశర్మ బైక్ మీద ప్రయాణిస్తున్న వారితో గొడవకు దిగారు.
ఈ క్రమంలో తమ కారును దాటేసి ముందుకు వెళుతున్న బైక్ ను వెంబడించిన దంపతులు 2కిలోమీటర్లు వెంబడించి.. వెనుక నుంచి బైక్ ను వేగంగా ఢీ కొట్టేసి వెళ్లిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దర్శన్.. వరుణ్ లను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ దర్శన్ చనిపోయాడు. వరుణ్ చికిత్స పొందుతున్నాడు. ఘటనాస్థలంలో కారుకు చెందిన విడిభాగాలు పడిపోతే.. కాసేపటికి మనోజ్.. ఆరతిలు తమ ముఖాలకు మాస్కులు వేసుకొని వెనక్కి వచ్చి.. వాటిని తీసుకెళ్లటం సీసీ కెమేరాలకు చిక్కింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ సాయంతో నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates