యూఎస్‌ స్టడీ వీసాలు.. కరోనా టైమ్ కంటే దారుణంగా..

అమెరికాలో ఉన్నత చదువులు చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్ పెద్ద అడ్డంకిగా మారాయి. అమెరికన్ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు మొదలయ్యే ఆగస్టు నెలలో, ఇండియన్ స్టూడెంట్స్‌కు ఇచ్చే వీసాల సంఖ్య ఏకంగా 44 శాతం పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఇంత భారీ క్షీణత నమోదు కావడం నిజంగా పెద్ద షాక్. మాస్ డిపోర్టేషన్లు, అరెస్ట్‌లతో ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై చాలా కఠినంగా ఉంటోంది. దీంతో తమ గోల్డెన్ ఫ్యూచర్ కోసం యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులు కూడా తమ ప్లాన్స్ మార్చుకుంటున్నట్లు ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ డేటా చెబుతోంది.

ట్రంప్ ఎఫెక్ట్ ఎంత ఉందంటే, మొత్తం విదేశీ విద్యార్థులకు ఇచ్చిన వీసాలు కూడా గత ఏడాదితో పోలిస్తే 19 శాతం తగ్గాయి. కరోనా టైమ్‌లో కూడా ఇంత పడిపోలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఆగస్టులో లక్షల్లో వీసాలు ఇస్తారు, కానీ ఈసారి ఆ సంఖ్య బాగా తగ్గింది. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే, ఒకప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ డామినేట్ చేసేవారు, కానీ ఈసారి చైనా విద్యార్థులకు ఏకంగా 86 వేలకు పైగా వీసాలు దక్కాయి. ఇది మనవాళ్లకు ఇచ్చిన సంఖ్య కంటే రెట్టింపు ఉండటం గమనార్హం.

ట్రంప్ సర్కార్ వీసా ప్రాసెస్‌లో తీసుకొచ్చిన ఒక మెయిన్ చేంజ్ ‘సోషల్ మీడియా వెట్టింగ్’. అంటే, వీసా కోసం అప్లై చేసిన వారి ఆన్‌లైన్ యాక్టివిటీని, సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఈ వెట్టింగ్ కోసం గత మే నెలలో ఏకంగా వీసా ఇంటర్వ్యూలను కూడా తాత్కాలికంగా ఆపేశారు. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నారు, ఎవరితో కలుస్తున్నారు అనేది చూశాకే వీసా ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేస్తున్నారు.

ఈ సోషల్ మీడియా స్కాన్ కారణంగా ప్రాసెసింగ్ టైమ్ పెరగడం, రిజెక్షన్స్ భయం ఎక్కువ అవ్వడం వంటివి జరుగుతున్నాయి. దీంతో స్టూడెంట్స్ అమెరికా వెళ్లాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా వీసా రద్దు అవుతుందేమోనని భయపడుతున్నారు. ఇదొక్కటే కాదు, హెచ్‌-1బీ వీసాలతో పాటు ఇతర దరఖాస్తుల ఫీజులను కూడా ట్రంప్ భారీగా పెంచేశారు.