ఉసేన్ బోల్ట్.. మెట్లు ఎక్కితే ఆయాసం

ఉసేన్ బోల్ట్.. ప్ర‌పంచంలోనే అత్యంత వేగ‌వంత‌మైన మ‌నిషిగా రికార్డు నెల‌కొల్పిన స్ప్రింట‌ర్. 100 మీట‌ర్ల ప‌రుగు, 200 మీట‌ర్ల ప‌రుగు, 4-100 మీట‌ర్ల రిలే ప‌రుగు.. ఈ మూడింట్లోనూ ప్ర‌పంచ రికార్డులు ఈ జ‌మైకా అథ్లెట్ సొంతం. వంద మీట‌ర్ల‌లో అత‌డి రికార్డు టైమింగ్ 9.58 సెకన్లు. ఎప్పుడో 2009లోనే అత‌నీ ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పాడు. 200 మీట‌ర్ల‌లో కూడా అదే ఏడాది 19.19 సెక‌న్ల‌తో రికార్డు బ‌ద్ద‌లు కొట్టాడు. ఇప్ప‌టిదాకా అవి చెక్కు చెద‌ర‌లేదు. వాటికి ద‌గ్గ‌ర‌గా కూడా ఎవ్వ‌రూ వెళ్ల‌ట్లేదు.

స్ప్రింట్‌కు అత‌ను తెచ్చిన ఆక‌ర్ష‌ణే వేరు. అత‌డికి ముందు, వెనుక ఎవ్వ‌రూ క్రీడాభిమానుల‌ను త‌న‌లా ఉర్రూత‌లూగించ‌ట్లేదు. ట్రాక్ మీద అంత‌టి ఆధిప‌త్యం చూపించిన బోల్ట్.. ఇప్పుడు మెట్లు ఎక్కుతుంటే ఆయాస‌ప‌డుతున్నాడ‌ట‌. స్టెప్స్ మీద వెళ్తుంటే ఊపిరి అంద‌ని ప‌రిస్థితి వ‌స్తోంద‌ని తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో అత‌ను చెప్ప‌డం చ‌ర్చనీయాంశ‌మైంది.

బోల్ట్ 2017లో రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. త‌ర్వాత అత‌ను నెమ్మ‌దిగా ప‌రుగు ఆపేశాడు. పెళ్లి చేసుకుని కుటుంబ జీవ‌నానికి ప‌రిమితం అయిన బోల్ట్..అప్పుడ‌ప్పుడూ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో క‌నిపిస్తూ వ‌చ్చాడు. కొన్నేళ్ల నుంచి అయితే మీడియాకు అస్స‌లు దొర‌క‌డం లేదు. ఐతే తాజాగా ప్ర‌పంచ అథ్లెటిక్ ఛాంపియ‌న్‌షిప్స్‌కు అత‌ను అతిథిగా హాజ‌ర‌య్యాడు. టోక్యోలో స్టేడియానికి వ‌చ్చి 100 మీట‌ర్ల ప‌రుగు ఈవెంట్‌ను వీక్షించాడు. ఆ సంద‌ర్భంగా అత‌ను అంత ఫిట్‌గా క‌నిపించ‌లేదు. కొంచెం పొట్ట కూడా వ‌చ్చిన‌ట్లు క‌నిపించింది.

ఈ నేప‌థ్యంలోనే మీడియాతో మాట్లాడుతూ.. తాను ప‌రుగుకు పూర్తిగా దూరం కావ‌డంతో మెట్లు ఎక్కుతున్న‌పుడు శ్వాస తీసుకోవ‌డం క‌ష్ట‌మ‌వుతున్న విష‌యాన్ని వెల్ల‌డించాడు. తాను జిమ్‌లో వ‌ర్క‌వుట్లు చేస్తున్నా కానీ.. ప‌రుగు మాత్రం తీయ‌ట్లేద‌ని.. మ‌ళ్లీ ఆ ప‌ని చేయాల‌నుకుంటున్నాన‌ని బోల్ట్ తెలిపాడు. ఇంట్లో పిల్ల‌ల్ని రెడీ చేసి స్కూలుకు పంప‌డం, టీవీలో వెబ్ సిరీస్‌లు చూడ‌డం, గేమ్స్ ఆడ‌డం, కుటుంబంతో గ‌డ‌ప‌డ‌మే ప్ర‌స్తుతం త‌న వ్యాఫ‌కాలుగా ఉన్నాయ‌ని ఉసేన్ వెల్ల‌డించాడు.