భారత్ తో చైనా – రష్యా.. అమెరికాకు దెబ్బె…

ప్రపంచ రాజకీయాల్లో శక్తి సమీకరణం మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తియాన్‌జిన్‌లో జరగబోతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమావేశంలో భారత్, చైనా, రష్యా నాయకులు ఒకే వేదికపైకి రావడం అమెరికాకు పెద్ద సవాల్‌గా మారింది. ట్రంప్‌ సుంకాల దాడులు, ఆర్థిక ఒత్తిళ్ల మధ్య ఈ ముగ్గురి భేటీ ప్రాధాన్యం మరింత పెరిగింది. ఒక్కో దేశం తమ స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా, బహుళ ధ్రువ ప్రపంచం కోసం కలిసి నిలబడుతున్నాయన్నది అమెరికాకు కఠిన పరీక్షగా మారింది.

మోదీ, పుతిన్‌, జిన్‌పింగ్‌లు కలిసి నిలబడటం అంటే యూరేషియా ప్రాంతంలో కొత్త శక్తి బ్లాక్‌ ఏర్పడినట్లే. ట్రంప్‌ విధానాల కారణంగా అమెరికా నమ్మదగిన భాగస్వామి కాదన్న భావన బలపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ వాణిజ్యాన్ని చైనాతో విస్తరించడం, రష్యాతో వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడటం వాషింగ్టన్‌కు తలనొప్పి అవుతుంది. అమెరికా విధిస్తున్న సుంకాలు, ఆంక్షలు ఒక్క దేశానికే కాకుండా మొత్తం గ్లోబల్‌ ఎకానమీపై భారమవుతున్నాయి. ఈ స్థితిలో భారత్‌, చైనా, రష్యా దగ్గర కావడం వల్ల అమెరికా ప్రభావం తగ్గిపోతుందన్న భయం వారికి కలుగుతోంది.

ఎస్‌సీవోలో వాణిజ్యం, రవాణా మౌలిక వసతులపై చర్చలు జరగబోతున్నాయి. ఇరాన్‌, వియత్నాం వంటి దేశాలు కూడా ఈ భేటీలో కీలక ఒప్పందాలకు సిద్ధమవుతున్నాయి. అణ్వస్త్ర ఆంక్షలు, సుంకాల వివాదాల కారణంగా అమెరికా ఒంటరితనంలోకి నెట్టబడుతోంది. బ్రిక్స్‌ తరహాలో ఎస్‌సీవోను కూడా వాణిజ్య వేదికగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది సఫలమైతే, అమెరికా ఆధిపత్యానికి మరో ప్రత్యామ్నాయం సిద్ధమైనట్లే. ముఖ్యంగా చమురు, గ్యాస్‌, ట్రేడ్‌ డీల్స్‌ విషయంలో ఈ బ్లాక్‌ ప్రభావం పెరిగితే అమెరికా మార్కెట్‌ షేర్‌ తగ్గిపోవచ్చు.

భద్రతా పరంగానూ ఈ ముగ్గురి కూటమి అమెరికా ఆధిపత్యానికి సవాల్‌ అవుతుంది. భారత్‌ ఉగ్రవాదాన్ని ఖండించే తీర్మానంపై పట్టుబడుతుండగా, రష్యా యూరేసియా భద్రతా ఒడంబడికపై దృష్టి పెట్టబోతోంది. చైనా అయితే ఈ వేదికను తమ గ్లోబల్‌ ప్రాధాన్యం పెంచుకునే అవకాశంగా మార్చుకుంటుంది. మూడు దేశాల సమన్వయం జరిగితే, సరిహద్దు వివాదాల వంటి సమస్యలకీ పరిష్కార మార్గం కనిపిస్తుంది. అమెరికా ఆధిపత్యానికి బదులుగా కొత్త శక్తి సమీకరణం రూపుదిద్దుకుంటుంది. మొత్తానికి తియాన్‌జిన్‌ వేదిక ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇస్తోంది. ఇకపై ఒకే దేశం ఆధిపత్యం చెలాయించే రోజులు పోయాయి. ఈ భేటీ విజయవంతమైతే, బహుళ ధ్రువ ప్రపంచానికి నిజమైన పునాది పడుతుంది. వర్ధమాన దేశాలు కలిసి ముందుకు రావడమే అమెరికాకు ఎదురైన అతిపెద్ద సవాల్‌గా మారబోతోంది.