PKL: కొత్త రూల్స్ తో కబడ్డీ.. ఈసారైనా క్లిక్కయ్యేనా?

ప్రొ కబడ్డీ లీగ్‌ (PKL) మొదటిసారి ప్రారంభమైనప్పుడు దేశమంతా ఫుల్‌ హంగామా క్రియేట్‌ చేసింది. టీవీ ముందు కూర్చున్నవాళ్ల నుంచి స్టేడియంల్లో కేకలు వేసినవాళ్ల వరకు అందరూ దీన్ని సెలబ్రేట్‌ చేశారు. కానీ కాలక్రమేణా ఈ క్రేజ్‌లో తగ్గుదల వచ్చింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వ్యూవర్‌షిప్‌ గణనీయంగా పడిపోయింది. ఇక నార్త్‌లో మాత్రం ఇంకా బాగానే ఆసక్తి కనిపిస్తోంది.

ఈ సారి లీగ్‌ నిర్వాహకులు కొన్ని కొత్త రూల్స్‌ను తీసుకొచ్చారు. మామూలు పాయింట్ల సిస్టమ్‌ కాకుండా, టై మ్యాచ్‌లకు షూటౌట్‌ రెయిడ్స్‌, గోల్డెన్‌ రెయిడ్‌ లాంటి ట్విస్టులు జోడించారు. మ్యాచ్‌ ఫలితం డ్రా కాకుండా ఎట్టకేలకు తేలాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేశారు. దీని వల్ల ఆట మరింత రసవత్తరంగా మారుతుందనే నమ్మకంలో నిర్వాహకులు ఉన్నారు.

ఈ సీజన్‌లో మొత్తం 12 జట్లు పోటీపడనున్నాయి. తెలుగు టైటాన్స్‌ తన తొలి మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌తో తలపడబోతోంది.  అదే సమయంలో నిర్వాహకులు ఈవెంట్‌ను హైప్‌ చేయడానికి స్పెషల్‌ ప్లాన్లు చేస్తున్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆటగాళ్లకు గౌరవాలు, ట్రోఫీ ఆవిష్కరణలు చేసి వాతావరణాన్ని రేపుతున్నారు. విశాఖ నుంచి జైపూర్‌, చెన్నై, ఢిల్లీ వరకూ జరగబోయే ఈ సీజన్‌ మొత్తం 108 మ్యాచ్‌లతో పెద్ద ఎత్తున ప్లాన్‌ చేశారు.

కొత్త పాయింట్స్ టేబుల్ సిస్టమ్

ఇక నుంచి మ్యాచ్ గెలిస్తే జట్టుకు 2 పాయింట్లు, ఓడిపోతే 0 పాయింట్లు మాత్రమే లభిస్తాయి. ఇలా సింపుల్‌గా మార్చడంతో ప్రేక్షకులు స్టాండింగ్స్‌ను సులభంగా ఫాలో అవ్వగలరని లీగ్‌ చెబుతోంది.

ప్లే-ఇన్స్ & ప్లే-ఆఫ్స్ కొత్త ఫార్మాట్

ఈ సీజన్‌లో మొదటిసారి ప్లే-ఇన్ మ్యాచ్‌లు కూడా వస్తున్నాయి. లీగ్ స్టేజ్‌లో టాప్ 8 జట్లు ప్లే-ఆఫ్స్‌కి చేరే అవకాశం ఉంటుంది.

5వ నుంచి 8వ స్థానాల్లో ఉన్న జట్లు ప్లే-ఇన్ మ్యాచ్‌లు ఆడి, గెలిచిన వారు ఎలిమినేటర్స్‌కి వెళ్తారు.

3వ, 4వ స్థానాల్లో ఉన్న జట్లు మినీ క్వాలిఫైయర్ ఆడతాయి. గెలిచినవారు ముందుకెళ్తారు, ఓడిన వారికి మళ్లీ మరో అవకాశం ఉంటుంది.

టాప్-2 జట్లు (1, 2 స్థానాలు) క్వాలిఫైయర్ 1లో తలపడతాయి. గెలిచినవారు నేరుగా ఫైనల్‌కి వెళ్తారు. ఓడినవారికి క్వాలిఫైయర్ 2లో మరో ఛాన్స్ ఉంటుంది.

ఈ కొత్త రీతితో మొత్తం 3 ఎలిమినేటర్స్‌, 2 క్వాలిఫైయర్స్‌ జరగబోతున్నాయి. ఫైనల్ వరకు ప్రతి మ్యాచ్ టెన్షన్‌తో సాగి అభిమానులను చివరి వరకూ ఉత్సాహంగా ఉంచుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.