హైదరాబాద్ బుల్లెట్ రైలు.. గెట్ రెడీ!

హైదరాబాద్ నుంచి బుల్లెట్ రైళ్ల ప్రయాణం త్వరలోనే వాస్తవ రూపం దాల్చబోతోందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ – ముంబయి హైస్పీడ్ రైలు కారిడార్‌కు సంబంధించిన డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధమై రైల్వే బోర్డుకు చేరింది. అదేవిధంగా హైదరాబాద్ – చెన్నై, హైదరాబాద్-బెంగళూరు మార్గాలకు తుది సర్వే పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ మార్గాల్లో రైళ్లను గంటకు గరిష్టంగా 350 కి.మీ., సగటుగా 250 కి.మీ. వేగంతో నడిపేలా డిజైన్ చేస్తున్నారు.

ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టులు పూర్తి అయితే హైదరాబాద్ నుంచి ముంబయి, చెన్నై, బెంగళూరుకు ప్రయాణ సమయం కేవలం మూడు గంటలకే కుదించబడనుంది. ప్రస్తుతం ఈ నగరాలకు రైలు ద్వారా 12-13 గంటలు పడుతుండగా, హైస్పీడ్ ట్రావెల్ ద్వారా సమయం ఆదా కావడంతో పాటు వ్యాపారం, విద్య, ఐటీ రంగాల్లో అనుసంధానం మరింత బలపడనుంది.

హైదరాబాద్-ముంబయి మార్గం కోసం ప్రతిపాదించిన 11 స్టేషన్లలో రాష్ట్రంలో రెండు స్టేషన్లు.. హైదరాబాద్, జహీరాబాద్ ఉంటాయి. ఈ మార్గంలో సుమారు 170 కి.మీ. తెలంగాణ పరిధిలోకి వస్తుంది. అలాగే చెన్నై, బెంగళూరు మార్గాలు కలుపుకొని రాష్ట్రంలో మొత్తం 580 కి.మీ. దూరం హైస్పీడ్ కారిడార్ ఉండనుంది. కేంద్రం ఆమోదం ఇచ్చిన వెంటనే భూసేకరణ, నిధుల మంజూరు వంటి ప్రక్రియలు మొదలవుతాయి.

హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళే మార్గం విషయంలో రైల్వే రెండు ప్రతిపాదనలు పరిశీలిస్తోంది. ఒకటి నల్గొండ మీదుగా, మరొకటి జాతీయ రహదారి 65 వెంట. కాజీపేట మార్గం కూడా ఉన్నప్పటికీ దూరం ఎక్కువ అవుతుందన్న కారణంతో ఆ ఆప్షన్ బలహీనంగా కనిపిస్తోంది. తుది నిర్ణయం త్వరలో తీసుకోనున్నారు. ఈ బుల్లెట్ రైళ్ల కోసం పాత రైల్వే ట్రాక్‌లను కాకుండా గ్రీన్‌ఫీల్డ్ మోడల్‌లో పూర్తిగా కొత్త మార్గాలను నిర్మించనున్నారు. ఈ మార్గాల్లో కేవలం బుల్లెట్ రైళ్లు మాత్రమే నడుస్తాయి. ముంబయి అహ్మదాబాద్ ప్రాజెక్ట్ పూర్తయ్యాక హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు మార్గాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ తెలిపింది. ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే హైదరాబాద్ నుంచి దక్షిణ భారత ముఖ్య నగరాలకు రవాణా మరింత వేగవంతం అవుతుంది.