భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వానల కారణంగా ఒక పెద్ద గంజాయి రహస్యాన్ని పోలీసులు బహిర్గతం చేశారు. అశ్వారావుపేట – దమ్మపేట మండలాల మధ్య ఉన్న ఓ ఆయిల్ ఫామ్ తోటలో దాచిన గంజాయి వరద నీటిలో బయటపడటం స్థానికులను, పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆదివారం కురిసిన భారీ వర్షాల వల్ల తోటలోని మట్టితో కప్పిన గంజాయి ప్యాకెట్లు వరద నీటిలో కొట్టుకుపోవడంతో ఇది వెలుగులోకి వచ్చింది.
ఇప్పటికే చెత్త, మట్టితో కప్పివేసిన 44 గంజాయి ప్యాకెట్లను ఎవరూ గుర్తించకుండా అక్కడ దాచినట్లు తెలుస్తోంది. అయితే వర్షంతో మట్టి తెరచడంతో ఆ ప్యాకెట్లు బయటపడ్డాయి. ఇవి వరద నీటిలో కొట్టుకుపోతుండగా స్థానికులు చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
ప్రతి ప్యాకెట్ దాదాపు 100 కిలోల బరువుతో ఉన్నట్లు సమాచారం. మొత్తం విలువ రూ.50 లక్షలు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు ఇలా భారీ మొత్తంలో దాచారో అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొంతమంది అనుమానితులను గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు ఈ గంజాయి తోటలో దాచడాన్ని చూస్తే ఇది ముందు నుండి పక్కాగా ప్లాన్ చేసిన అక్రమ రవాణా ముఠా చర్యగా భావిస్తున్నారు. గంజాయి తడవ్వకుండా ప్లాస్టిక్ ప్యాకింగ్లో ఉందన్న అంశం ఈ విషయాన్ని మరింత బలపరుస్తోంది.
ఈ ఘటనతో స్థానికులలో ఉలిక్కిపాటు కలిగింది. వ్యవసాయ భూముల మధ్య ఈ తరహా అక్రమ కార్యకలాపాలు జరుగుతుండటం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు దీనిపై మరింత లోతుగా విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వర్షం లేకపోయుంటే ఈ మత్తుపదార్థం అక్రమంగా ఎక్కడికో తరలించేవారు. వాన వల్ల వెలుగులోకి వచ్చిన ఈ గంజాయి గుట్టు, ఇప్పుడు ముఠాలపై కీలక సమాచారాన్ని ఇవ్వబోతుందనే నమ్మకంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates